మోడీ ఎఫెక్ట్: తమిళనాడులో విద్యార్థులు, ప్రతిపక్షాల ఆందోళన, కర్ణాటకపై బీజేపీ కనికరం!
చెన్నై: కావేరీ నదీ నీరు పంపిణి విషయంలో తమిళనాడుకు అన్యాయం జరిగిందని, కావేరీ మేనేజ్ మెంట్ బోర్డు ఏర్పాటు చేసి కేంద్ర ప్రభుత్వం తమిళనాడు రైతులకు న్యాయం చెయ్యాలని, మోడీ ప్రభుత్వం కర్ణాటక మీద కనికరం చూపిస్తోందని ఆరోపిస్తూ గత నాలుగు రోజుల నుంచి చేస్తున్న ఆందోళన బుధవారం కొనసాగింది.
ప్రభుత్వం విఫలం
కావేరీ మేనేజ్ మెంట్ బోర్డు ఏర్పాటు చేయించడానికి కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకువచ్చే విషయంలో తమిళనాడు ప్రభుత్వం పూర్తిగా విఫలం అయ్యిందని ఆరోపిస్తూ ఆ రాష్ట్రంలోని ప్రతిపక్ష పార్టీల నాయకులు, కార్యకర్తలు ఆందోళన చేస్తున్నారు.
విద్యార్థుల ఉద్యమం
కావేరీ మేనేజ్ మెంట్ బోర్డు ఏర్పాటు చెయ్యాలని డిమాండ్ చేస్తూ చెన్నై నగరంతో సహ తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులు ఆందోళన చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే కావేరీ మేనేజ్ మెంట్ బోర్డు ఏర్పాటు చెయ్యాలని విద్యార్థులు ఆందోళనకు దిగడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
సముద్రంలోకి విద్యార్థులు
కావేరీ మేనేజ్ మెంట్ బోర్డు ఏర్పాటు చెయ్యాలని డిమాండ్ చేస్తూ రామేశ్వరం, కన్యాకుమారిలో విద్యార్థులు, తమిళ సంఘాల కార్యకర్తలు సముద్రంలోకి వెళ్లి నిరసన వ్యక్తం చేస్తున్నారు. సముద్రంలో నిలబడి ఆందోళన చేస్తున్న వారిని బయటకు రప్పించడానికి పోలీసులు నానా ఇబ్బందులు పడుతున్నారు.
ప్రతిపక్షాలు ఏకం
కావేరీ మేనేజ్ మెంట్ బోర్డు ఏర్పాటు చేయించడంలో తమిళనాడు ప్రభుత్వం పూర్తిగా విఫలం అయ్యిందని ఆరోపిస్తూ ఆ రాష్ట్రంలోని ప్రతిపక్ష పార్టీలు డీఎంకే, కాంగ్రెస్, మక్కల్ నీది మయ్యమ్, సీపీఎం, సీపీఐ, నమ్మ తమిళర కచ్చి తదితర పార్టీల కార్యకర్తలు రాస్తారోకో, రైలు రోకో, ధర్నాలు చేస్తున్నారు.
కేంద్రం భాద్యత
కావేరీ మేనేజ్ మెంట్ బోర్డు ఏర్పాటు చెయ్యడం కేంద్ర ప్రభుత్వం బాధ్యత అని మక్కల్ నీది మయ్యమ్ పార్టీ వ్యవస్థాపకుడు, హీరో కమల్ హాసన్ బుధవారం అన్నారు. కేంద్ర ప్రభుత్వం కావేరీ మేనేజ్ మెంట్ బోర్డు ఏర్పాటు చేసే వరకు పోరాటం చేస్తామని డీఎంకే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎంకే. స్టాలిన్ హెచ్చరించారు.