సరిహద్దుల్లో గస్తీకి త్వరలో బుల్లి రోబోలు..ఈ టెక్నాలజీతోనే పనిచేస్తాయి
ప్రపంచవ్యాప్తంగా ఉగ్రవాదం పెరిగిపోతోంది. ఏదో ఒక దేశంలో ఉగ్రవాదులు రెచ్చిపోతూనే ఉన్నారు. శ్రీలంకలో ఏప్రిల్ 20న జరిగిన ఉగ్రదాడుల్లో 250 మందికి పైగా మృతి చెందిన విషయం తెలిసిందే. ఇక భారత్లో కూడా మరో భారీ విధ్వంసానికి ఉగ్రవాదులు కుట్రపన్నినట్లు ఇంటెలిజెన్స్ విభాగం హెచ్చరిస్తోంది. ఇక దేశ సరిహద్దుల్లో భద్రతను కట్టుదిట్టం చేసేందుకు భారత సైంటిస్టులు కృషి చేస్తున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో పనిచేసే బుల్లి రోబోలను సరిహద్దుల్లో గస్తీకోసం వినియోగించనున్నారు. దేశ సరిహద్దుల్లో ఇవీ గస్తీ చేపడతాయి.
బుల్లి రోబోలను తయారు చేస్తున్న భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్
దేశ సరిహద్దుల్లో భద్రతను కట్టుదిట్టం చేసేందుకు బుల్లి రోబోలను బెంగళూరులోని భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (బెల్) తయారు చేస్తోంది.ఈ ఏడాది డిసెంబరుకల్లా ఈ బుల్లి రోబోలు విధుల్లో చేరుతాయని అధికారులు చెబుతున్నారు. ఈ రోబోలు సెన్సార్లు, ప్రత్యేక ప్రోగ్రామింగ్ కలిగిన కమ్యూనికేషన్ వ్యవస్థ కలిగి ఉంటాయి. ఇవన్నీ కంట్రోల్ రూమ్కు అనుసంధానం కలిగి ఉంటాయి.అంతేకాదు ఉగ్రవాద దాడుల సమయంలో కూడా ఇవి చాలా ఎఫెక్టివ్గా పనిచేయగలవని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
దేశ సరిహద్దుల్లో గస్తీ నిర్వహించనున్న బుల్లి రోబోలు
ప్రస్తుతం ఈ బుల్లి రోబోల ప్రాథమిక కర్తవ్యం దేశ సరిహద్దుల్లో గస్తీ నిర్వహించడమే అని అధికారులు చెప్పారు. అంతేకాదు సరిహద్దుల్లో శతృవుల నుంచి భారత జవాన్ల ప్రాణాలు కూడా కాపాడే బాధ్యతను ఈ రోబోలు తీసుకోనున్నాయి.ఇక ఈ రోబోలు ధర రూ.70 లక్షల నుంచి రూ. 80 లక్షల వరకు ఉండే అవకాశం ఉంది. ఈ ధర చిన్న మొత్తం ఆర్డర్లకు మాత్రమే వర్తిస్తుందని.. అదే భారత ఆర్మీ పెద్ద సంఖ్యలో రోబోల కోసం ఆర్డరు ఇస్తే ధర మరింత తగ్గే అవకాశం ఉంటుందని బెల్ అధికారులు తెలిపారు.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీతో పనిచేసే రోబోలు
ప్రస్తుతం 80మంది సైంటిస్టులు, ఇంజినీర్లు ఈరోబోలను రూపొందించే పనిలో తలమునకలై ఉన్నారు. బెంగళూరు, ఘజియాబాద్లోని మూడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ల్యాబుల్లో ఈ రోబోలు తయారు అవుతున్నాయి. తొలి ప్రొటోటైప్ రోబోకు సంబందించి అంతర్గత సమీక్షను డిసెంబర మొదటి వారంలో నిర్వహిస్తామని బెల్ సంస్థ చెబుతోంది. ఇక తొలి ట్రయల్ ఫిబ్రవరి 2020లో నిర్వహిస్తామని చెప్పారు. వీటితో పాటు ఈ ఏడాది చివరికల్లా మరిన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో పనిచేసే పరికరాలను తయారు చేస్తామని బెల్ అధికారులు స్పష్టం చేశారు.