బాబ్రీని కూల్చినందుకు గర్వంగా ఉంది : ప్రగ్యా ఠాకూర్ ! మళ్లీ నోరు జారిన సాధ్వీ !
ఢిల్లీ : ముంబై ఉగ్రదాడిలో అమరుడైన యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ ఛీప్ హేమంత్ కర్కరేపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సాధ్వీ ప్రగ్యాసింగ్ మరోసారి నోరు జారారు. బాబ్రీ మసీదు కూల్చివేతపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీనిపై స్పందించిన ఎన్నికల సంఘం విద్వేషాలు రెచ్చగొడుతున్నారంటూ ఆమెకు నోటీసులు జారీచేసింది. అయినా వెనక్కి తగ్గని ప్రగ్యా ఠాకూర్ తన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని స్పష్టం చేశారు.
సాద్వి ప్రగ్యా సింగ్ వ్యాఖ్యలను సుమోటాగా స్వీకరించిన ఈసీ, నోటీసులు జారీ.
బాబ్రీని ధ్వంసం చేసినందుకు గర్విస్తున్నా
మాలేగావ్ కేసులో నిందుతురాలైన సాధ్వీ ప్రగ్యా సింగ్ ఠాకూర్ ప్రస్తుతం బెయిల్పై ఉన్నారు. భోపాల్ నుంచి కాంగ్రెస్ నేత దిగ్విజయ్ సింగ్కు ప్రత్యర్థిగా లోక్సభ బరిలో దిగుతున్నారు. తాజాగా ఓ టీవీ ఛానెల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రగ్యా.. అయోధ్యలో బాబ్రీ మసీదు కూల్చివేతలో తాను భాగస్వామినని చెప్పారు. అందుకు గర్విస్తున్నానని అన్నారు. తాను అయెధ్యకు వెళ్లి రామాలయ నిర్మాణంలో పాలుపంచుకుంటానని, అలా చేయకుండా తనను ఎవరూ అడ్డుకోలేరని స్పష్టం చేశారు.
ఈసీ నోటీసులు
బాబ్రీ ధ్వంసంపై సాధ్వీ ప్రగ్యాసింగ్ ఠాకూర్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారడంతో ఎన్నికల సంఘం స్పందించింది. ఈ అంశంపై భోపాల్ జిల్లా ఎన్నికల అధికారి ఆమెకు నోటీసులు జారీ చేశారు. మత విద్వేషాలు రెచ్చగొట్టేలా చేసిన వ్యాఖ్యలపై 24 గంటల్లోగా వివరణ ఇవ్వాలని స్పష్టం చేశారు.
వ్యాఖ్యలను ఉపసంహరించుకోనన్న సాధ్వీ
ఎలక్షన్ కమిషన్ నోటీసులపై స్పందించిన సాధ్వీ ప్రగ్యా ఠాకూర్ తన వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకోనని స్పష్టం చేశారు. తాను అయోధ్య వెళ్లి ఆ కట్టడాన్ని ధ్వంసం చేయడంలో పాలుపంచుకున్నానని మరోసారి తేల్చిచెప్పారు. బాబ్రీపై శనివారం చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానన్న ఆమె రామమందిర నిర్మాణంలో పాల్గొనకుండా ఎవరూ ఆపలేరని పునరుద్ఘాటించారు.