ప్రధాని మోడీ లాంటి వ్యక్తి గర్వకారణం: కాంగ్రెస్ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ ప్రశంసలు
శ్రీనగర్: ప్రధాని నరేంద్ర మోడీపై కాంగ్రెస్ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ ప్రశంసలు కురిపించారు. ప్రధాని హోదాలో ఉన్నప్పటికీ తన మూలాల గురించి నరేంద్ర మోడీ చెప్పుకోవడం గొప్ప విషయమని అన్నారు. జమ్మూకాశ్మీర్లో గుజ్జర్లు ఏర్పాటు చేసిన బహిరంగ సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు.
ప్రధాని మోడీ తన గ్రామీణ నేపథ్యాన్ని, చాయ్ అమ్మిన విషయాలను కూడా దాచుకోలేదని, నిజాన్ని దాచని వ్యక్తిత్వం మోడీ సొంతమని గులాం నబీ ఆజాద్ కొనియాడారు. చాలా మంది నాయకుల్లో మంచి విషయాలను తాను ఇష్టపడతానని చెప్పారు. తాను కూడా గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చిన వ్యక్తినేనని, ఇందుకు గర్వపడతానని చెప్పుకొచ్చారు.
గ్రామీణ ప్రాంత వ్యక్తిగా, చాయ్ వాలా అని మోడీ చెప్పుకోవడం గర్వపడే విషయమని ఆజాద్ వ్యాఖ్యానించారు. రాజకీయంగా తాము ప్రత్యర్థులమే కావచ్చు కానీ.. ఆయన నిజాన్ని నిర్భయంగా చెప్పుకోవడాన్ని అభినందిస్తున్నట్లు తెలిపారు. ప్రధానమంత్రి అయినప్పటికీ తన మూలాలను మరచిపోని వ్యక్తి నరేంద్ర మోడీ అని, అలాంటి వ్యక్తి నుంచి ఎంతో నేర్చుకోవచ్చని.. ఆయన లాంటి నాయకుడు మనకు గర్వకారణమని ఆజాద్ ప్రశంసించారు. దేశంలో ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న తరుణంలో ఆజాద్ వ్యాఖ్యలు బీజేపీ కలిసి రానుండగా, కాంగ్రెస్ పార్టీకి కొంత నష్టం చేసేవిగా ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
#WATCH I like lot of things about many leaders. I'm from village & feel proud... Even our PM hails from village & used to sell tea. We're political rivals but I appreciate that he doesn't hide his true self. Those who do, are living in bubble: Congress' Ghulam Nabi Azad in Jammu pic.twitter.com/8KKIYOwzZB
— ANI (@ANI) February 28, 2021
కాగా, గత పార్లమెంటు సమావేశాల్లో ఫిబ్రవరి 9న గులాం నబీ ఆజాద్కు వీడ్కోలు కార్యక్రమం జరిగిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ప్రధాని మోడీ మాట్లాడుతూ.. ఆజాద్పై ప్రశంసాపూర్వక వ్యాఖ్యలు చేశారు. అంతేగాక, కన్నీరు కూడా పెట్టుకున్నారు. ఆజాద్ లాంటి వ్యక్తి తనకు నిజమైన మిత్రుడని భావోద్వేగానికి గురయ్యారు. ఆజాద్ సేవలను, ఆయనతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ పలుమార్లు కన్నీరుపెట్టుకున్నారు మోడీ. అంతేగాక, ఆజాద్ను ఎన్నటికీ పదవీ విరమణ చేయనివ్వబోమని, ఆజాద్ సేవలను ఉపయోగించుకుంటామన్నారు.
కాగా, జీ-23 పేరుతో కాంగ్రెస్ రెబల్స్లో కొందరు బలప్రదర్శన చేశారు. పార్టీ పరిస్థితిపై ప్రతికూల వ్యాఖ్యలు చేశారు. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ బలహీనపడుతోందని ఆందోళన వ్యక్తం చేస్తూనే... పార్టీ బలోపేతం కోసం ఏ త్యాగానికైనా సిద్ధమేనన్నారు. ఈ సమావేశంలోనే ఆజాద్ ప్రధాని మోడీపై ప్రశంసలు చేయడం గమనార్హం. గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ అనే ఓ ప్రభుత్వేతర సంస్థ ఆధ్వర్యంలో రెబల్స్ లీడర్ గులాంనబీ ఆజాద్ ఈ శాంతి సమ్మేళనాన్ని ఏర్పాటు చేశారు. తాము ఆశామాషీగా పార్టీలోకి రాలేదన్నారు మరో సీనియర్ నేత ఆనంద్శర్మ. దొడ్డిదారిన వచ్చిన వాళ్లం కాదని స్పష్టం చేశారు. విద్యార్థి, యువ ఉద్యమాల్లో పాల్గొన్ని పార్టీలోకి వచ్చామన్నారు. తాము కాంగ్రెస్ వాదులమా కాదా అని చెప్పే హక్కు ఎవ్వరికీ లేదన్నారు. అందరూ తమను జీ-23 అంటున్నారని.. తాము గాంధీ-23 గ్రూప్గా అభివర్ణించారాయన.