మేలా? ఫిమేలా?: లింగ నిర్ధారణ కోసం హిజ్రాపై వేధింపులు..పోలీసుల బరితెగింపు
ముంబై: ముంబై రైల్వే సాధారణ పోలీసులు (జీఆర్పీ) బరి తెగించారు. లింగ నిర్ధారణ కోసం ఓ ట్రాన్స్ జెండర్ మహిళను వేధింపులకు గురి చేశారు. ఆమెపై వివక్షను ప్రదర్శించారు. కేసును నమోదు చేయడానికి నిరాకరించారు. లింగ నిర్ధారణ సర్టిఫికెట్ లేకపోతే తాము ఎఫ్ఐఆర్ ను నమోదు చేయలేమని తేల్చి చెప్పారు. ముంబై సెంట్రల్ రైల్వే స్టేషన్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఓ వ్యక్తి తనపై లైంగిక దాడి చేశాడంటూ ట్రాన్స్ జెండర్ మహిళ ఇచ్చిన ఫిర్యాదును రైల్వే సాధారణ పోలసులు తిరస్కరించారు. దీనికి కారణం ఆమె వద్ద లింగ నిర్ధారణ సర్టిఫికెట్ లేకపోవడమే.
బాధిత ట్రాన్స్ జెండర్ మహిళ ముంబైలోని దాదర్ లో నివసిస్తున్నారు. రాత్రి ఆమె నవీ ముంబై నుంచి దాదర్ కు లోకల్ రైలులో బయలుదేరారు. రైలులో ప్రకాశ్ దేవేంద్ర భట్ అనే వ్యక్తి ట్రాన్స్ జెండర్ మహిళ పట్ల అసభ్యకరంగా ప్రవర్తించారు. లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. రైలు దాదర్ స్టేషన్ కు చేరుకోగానే ఆమె జీఆర్పీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనతో పాటు రైలులో ప్రయాణించిన ప్రకాశ్ దేవేంద్ర భట్ అనే వ్యక్తి తనపై లైంగిక దాడికి పాల్పడ్డాడని, తాకరాని చోట చేతులు వేశాడంటూ ఫిర్యాదు చేశారు. ఈ విషయాన్ని పోలీసులు దీన్ని తేలిగ్గా తీసుకున్నారు. పైగా ట్రాన్స్ జెండర్ మహిళ పట్ల అవమానకరంగా వ్యవహరించారు.
పురుషుడివా? స్త్రీవా అంటూ ప్రశ్నలు వేసి, తనను మానసిక క్షోభకు గురి చేశారని బాధిత ట్రాన్స్ జెండర్ మహిళ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని ఫేస్ బుక్ లో పోస్ట్ చేశారు. లింగ నిర్ధారణ సర్టిఫికెట్ తీసుకుని వస్తేనే ఎఫ్ఐఆర్ నమోదు చేస్తామని పోలీసులు తేల్చి చెప్పారని రాసుకొచ్చారు. దీనిపై నెటిజన్ల నుంచి పెద్ద ఎత్తున స్పందన కనిపించింది. జీఆర్పీ పోలీసులు వైఖరిని తప్పు పట్టారు. ముంబై పోలీసు యంత్రాంగాన్ని ట్రోల్ చేశారు. ఈ ఘటనను తీవ్రంగా తీసుకున్నారు రైల్వే పోలీస్ ఎస్పీ. వెంటనే నిందితుడిపై కేసు నమోదు చేయాలని ఆదేశించారు.
అదే సమయంలో ట్రాన్స్ జెండర్ మహిళ తాను మహిళేనని నిరూపించడానికి అవసరమైన లింగ నిర్ధారణ సర్టిఫికెట్ ను జీఆర్పీ పోలీసులకు అందజేశారు. సుమారు రెండు గంటల తరువాత దేవేంద్ర భట్ పై కేసు నమోదైంది. నిబంధనల ప్రకారం.. ట్రాన్స జెండర్లు తమ లింగ నిర్ధారణ సర్టిఫికెట్ ను అందజేసిన తరువాతే కేసు నమోదు చేయాల్సి ఉంటుందని, లైంగిక వేధింపులకు గురైన కేసులో తొలుత కేసు నమోదు చేయడానికే జీఆర్పీ పోలీసులు ప్రాధాన్యత ఇచ్చి ఉండాల్సిందని ఎస్పీ అన్నారు. ట్రాన్స్ జెండర్ మహిళపై లైంగిక వేధింపులకు పాల్పడిన దేవేంద్ర భట్ పై చట్ట ప్రకారం శిక్షిస్తామని స్పష్టం చేశారు.