ఇస్రో హిస్టరీలో మరో సక్సెస్... ఇమిశాట్ రాకతో శత్రు రాడార్ల ఖేల్ ఖతం!
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో మరో సక్సెస్ సాధించింది. పీఎస్ఎల్వీ సీ 45 రాకెట్ను విజయవంతంగా నింగిలోకి పంపింది. నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్ షార్ నుంచి ఇమిశాట్తో పాటు 28 విదేశీ ఉపగ్రహాలను వాటి కక్ష్యలో ప్రవేశపెట్టింది. నాలుగు స్టపాన్ బూస్టర్ల సాయంతో చేపట్టిన ప్రయోగం కావడంతో దీనికి పీఎస్ఎల్వీ క్యూఎల్ అని పేరు పెట్టారు. ఇస్రో చరిత్రలో ఈ తరహా రాకెట్ ప్రయోగం ఇదే మొట్టమొదటిది కావడం విశేషం.
నింగిలోకి దూసుకెళ్లిన పీఎస్ఎల్వీ సీ 45
28 గంటలపాటు సాగిన కౌంట్డౌన్
పీఎస్ఎల్వీ ప్రయోగానికి ముందు 28 గంటల పాటు కౌంట్డౌన్ కొనసాగింది. ఆదివారం ఉదయం 5.27 గంటలకు ప్రారంభమైన కౌంట్డౌన్ సోమవారం ఉదయం 9.27గంటల వరకు కొనసాగింది. రాడార్ వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు చేపట్టిన ఈ ప్రయోగం 3గంటల్లో పూర్తైంది.
నాలుగు దశలు.. 29 ఉపగ్రహాలు..
పీఎస్ఎల్వీ సీ 45 ప్రయోగం నాలుగు దశల్లో జరిగింది. భారత్కు చెందిన ఇమిశాట్తో పాటు అమెరికాకు చెందిన 24, లిథువేనియాకు చెందిన రెండు, స్పెయిన్, స్విట్జర్లాండ్ కు సంబంధించి ఒక్కో శాటిలైట్తో కలుపుకుని మొత్తం 28 విదేశీ నానో ఉపగ్రహాలను ఒకదాని తర్వాత ఒకటి కక్ష్యలోకి చేర్చారు. 749కిలోమీటర్ల ఎత్తున్న కక్ష్యలో ఇమిశాట్ను ప్రవేశపెట్టిన సైంటిస్టులు, విదేశీ ఉపగ్రహాలను 504కిలోమీటర్ల భూకక్ష్యలో నిలిపింది. ఇక నాలుగవ దశలో మైక్రో గ్రావిటీని సృష్టించి పరిశోధనలు చేపట్టనున్నారు.
శత్రురాడార్ల పనిపట్టే ఇమిశాట్
డీఆర్డీఓ రూపొందించిన ఇమిశాట్ శత్రు దేశాల రాడార్ల జాడ గుర్తించడంలో దిట్ట. 436 కిలోల బరువున్న ఈ శాటిలైట్ తక్కువ ఎత్తు కక్ష్యలో తిరుగుతూ రక్షణశాఖకు అవసరమైన సమాచారాన్ని అందిస్తుంది. ముఖ్యంగా శత్రుదేశాల రాడార్లకు సంబంధించిన సమాచారాన్ని అందించనుంది. ఇప్పటి వరకు ఇలాంటి సమాచారం సేకరణ కోసం భారత్ విమానాలపై ఆధారపడుతోంది. ఇమిశాట్ రాకతో ఇక అంతరిక్షం నుంచి శత్రువుల కదలికలపై కన్నేసే అవకాశం లభిస్తుంది.