పీఎస్ఎల్వీ - సీ 46 ప్రయోగానికి సర్వం సిద్ధం.. 25గంటల పాటు కొనసాగనున్న కౌంట్డౌన్
నెల్లూరు : భారత అంతరిక్ష పరిశధన సంస్థ.. ఇస్రో మరో ఉపగ్రహ ప్రయోగానికి సిద్ధమైంది. నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని సతీష్ థావన్ స్పేస్ సెంటర్ షార్ నుంచి బుధవారం ఉదయం 5.30గంటలకు పీఎస్ఎల్వీ సీ 46 రాకెట్ ప్రయోగించనున్నారు. ప్రయోగంలో భాగంగా శాస్త్రవేత్తలు సోమవారం ప్రీ కౌంట్డౌన్ను విజయవంతంగా నిర్వహించారు. మంగళవారం తెల్లవారుజామున 4.30 గంటలకు ప్రారంభమైన కౌంట్డౌన్ 25 గంటల పాటు నిర్విరామంగా కొనసాగనుంది.
రక్షణ రంగానికి నూతనోత్తేజం
షార్లోని ఫస్ట్ లాంచింగ్ ప్యాడ్ నుంచి ప్రయోగించనున్న రాకెట్ ద్వారా సైంటిస్టులు 615కిలోల బరువున్న రీశాట్ 2బి ఉపగ్రహాన్ని రోదసిలోకి పంపనున్నారు. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన ఈ ఉపగ్రహం భారత రక్షణ రంగానికి నూతనోత్తేజం ఇవ్వనుంది. రక్షణతో పాటు వ్యవసాయ, అటవీ రంగాలకు కూడా ఈ శాటిలైట్ సేవలందించనుంది. రీశాట్ సీరిస్లో ఇస్రో ఇప్పటికే ముడు ఉపగ్రహాలను విజయవంతంగా ప్రయోగించింది.
అంతరిక్ష శకలాల కారణంగా మారిన సమయం
పీఎస్ఎల్వీ సీ 46 ను తొలుత ఉదయం 5.27గంటలకు ప్రయోగించాలని శాస్త్రవేత్తలు నిర్ణయించారు. అయితే అంతరిక్షంలో పలు శకలాలు అడ్డుపడే అవకాశముండటంతో ప్రయోగాన్ని మూడు నిమిషాలు పెంచారు. పీఎస్ఎల్వీ ప్రయోగాల్లో ఇది 48వది కాగా.. ఫస్ట్ లాంచ్ ప్యాడ్ నుంచి 36వ రాకెట్ కావడం విశేషం. ఇప్పటి వరకు షార్ నుంచి 71 రాకెట్ ప్రయోగాలు జరగగా... ఈ ఏడాది ఇది మూడోది కావడం విశేషం.
శ్రీవారిని దర్శించుకున్న శివన్
పీఎస్ఎల్వీ ప్రయోగం నేపథ్యంలో ఇస్రో ఛైర్మన్ కె. శివన్ తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన.. పీఎస్ఎల్వీ సీ 46 ప్రయోజం విజయవంతం కావాలని స్వామివారిని కోరుకున్నట్లు చెప్పారు. చెంగాళమ్మ ఆలయంలో పూజల అనంతరం శివన్ షార్కు చేరుకోనున్నారు. ప్రయోగవేదిక వద్ద పనులు, కౌంట్డౌన్ను పరిశీలించిన తర్వాత సైంటిస్టులతో సమావేశం కానున్నారు.