పబ్జీగేమ్ ఇక నుండి ఆరుగంటలే .. పబ్జీవాలాలకు షాక్ .. పేరెంట్స్ కు గుడ్ న్యూస్
ఒకటి కాదు రెండు కాదు దేశ వ్యాప్తంగా రోజూ జరుగుతున్న వరుస సంఘటనల నేపధ్యంలో పబ్జీ పై ఆంక్షలు పెట్టె విధంగా టెన్సెంట్ కంపెనీపై ఒత్తిడి తెచ్చింది భారత ప్రభుత్వం . యువత భవిత నాశనం చెయ్యటమే కాకుండాపబ్జీ ప్రాణాంతకంగా మారుతున్న నేపధ్యంలో పబ్జీ వాలాలకు షాక్ ఇచ్చింది . ప్రమాదకరమైన ఆట ఆడొద్దు అని తల్లిదండ్రులు మొత్తుకున్నా వినని యువతకు ఇక నుండీ ఆరు గంటలే పబ్జీ ఆట అని తేల్చి చెప్పేసింది. చాలా పాపులర్ అయిన ఆన్లైన్ గేమ్ పబ్జీ గేమ్ కు సంబంధించి రోజుకో ఘటన అందరి మనసులను కలచి వేస్తున్న తరుణంలో పబ్జీ ఆటపై టైం లిమిట్ పెడుతూ నిర్ణయం తీసుకుంది టెన్ సెంట్ గేమింగ్ కంపెనీ . పబ్జీ వాలాలకు షాకిచ్చే ఈ నిర్ణయంతో ఇండియా లో పబ్జీ గేమ్ కేవలం ఆరుగంటల వరకే ఆట ఆడే అవకాశం ఇస్తుంది .
పబ్జీ ఆడుతూ మెడనరాలు పట్టేసి ... జగిత్యాల యువకుడు బలి
దేశ వ్యాప్తంగా పబ్జీ మరణాలెన్నో... గుజరాత్ లో పబ్జీపై బ్యాన్
దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకు చాలా పబ్జీ మరణాలు చోటు చేసుకున్నాయి. పబ్జీ ఆడుతూ ఏమరపాటులో ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు ఉన్నారు. పబ్జీ ఆడుతూ రైలు వచ్చేది కూడా చూసుకోకుండా ఇద్దరు యువకులు, పబ్జీ ఆడుతూ మంచి నీళ్ళనుకుని యాసిడ్ తాగిన యువకుడి కథనాలు పబ్జీ ఆడితే పక్కన ఏమి జరుగుతుందో, తామేమి చేస్తామో కూడా అర్ధం కానివ్వదు అని తెలుస్తుంది. ఇక ఈ వ్యసనానికి బానిసై టాప్ స్టూడెంట్ అయిన ఒక యువకుడు పరీక్షలో పబ్జీ వ్యాసం రాసి ఫెయిల్ అయితే, పబ్జీ ఆడటానికి ఫోన్ కొనివ్వలేదని, పబ్జీ ఇంట్లో ఆడొద్దు అన్నారని కొందరు యువకులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. నిన్నటికి నిన్న పబ్జీ ఆడుతూ జగిత్యాల యువకుడు మెడనరాలు పట్టి మరణిస్తే, ఒక బాలుడు ఆట మోజులో ఇల్లు వీడి పోయాడు . ఇలా నిత్యం జరుగుతున్న ఘటనల నేపధ్యంలో పబ్జీ పై బ్యాన్ విధించాలని తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. గుజరాత్ రాష్ట్రంలో పబ్జీ బ్యాన్ ను కఠినం గా అమలు చేస్తున్నారు. పొరబాటున ఎవరైనా ఆడితే జైలుకే అని తేల్చి చెప్తున్నారు. ఆదినవారిపై కేసులు నమోదు చేస్తున్నారు.
ఇండియాలో పబ్జీ ఆట ఇక నుండి ఆరుగంటలే .. తల్లిదండ్రులకు కాస్త ఊరట
ప్రస్తుతం యువతకు ఈ గేమ్ వ్యసనంలా మారిన ఈ గేమ్ను బ్యాన్ చేయాలని స్వచ్ఛంద సంస్థల దగ్గర్నుంచి రాజకీయ పార్టీల వరకు డిమాండ్ చేస్తున్నాయి. ఫలితంగా ఈ గేమ్కి అడ్డుకట్ట వేసే పని ప్రారంభమైంది. ఇకపై ఆరు గంటలు మించి పబ్జీ ఆడలేరు. ఇండియాలో కేవలం ఆరు గంటలు మాత్రమే పబ్జీ ఆడేందుకు అనుమతి లభించింది.ఎవరైనా రోజుకు 6 గంటలు పబ్జీ ఆడగానే తాత్కాలికంగా బ్లాక్ అవుతుంది. మళ్లీ మరుసటి రోజు వరకు ఇక పబ్జీ ఆడే అవకాశం లేకుండా చేసింది ఆ గేమింగ్ కంపెనీ . పబ్జీ 6 గంటలు ఆడగానే హెల్త్ రిమైండర్ రావడంపై అధికారికంగా ఎలాంటి స్టేట్మెంట్ విడుదల కాలేదు కానీ... ప్లేయర్స్ మొబైల్పై హెల్త్ రిమైండర్ పేరుతో నోటిఫికేషన్ కనిపిస్తోంది. 18 ఏళ్ల లోపు వయస్సుగల ప్లేయర్స్కు 2 నుంచి 4 గంటల లోపే హెల్త్ రిమైండర్ నోటిఫికేషన్ వస్తోంది. సదరు గేమింగ్ కంపెనీ మీద చాలా ఒత్తిడి తెచ్చి ఈ నిర్ణయం తీసుకునేలా చేసింది భారత సర్కార్ . ఇలా చెయ్యటం వల్ల కొంతవరకైనా అడిక్షన్ నుండి బయట పడెయ్యొచ్చు అని ప్రభుత్వం భావిస్తుంది . ఈ నిర్ణయం పై తల్లిదండ్రులు కాస్త హర్షం వ్యక్తం చేసినా బ్యాన్ చేస్తే సమస్యకు పూర్తి స్థాయి పరిష్కారం దొరికినట్టు అవుతుందని భావిస్తున్నారు. ఆ దిశగా ప్రభుత్వ నిర్ణయం కోసం వేచి చూస్తామని చెప్తున్నారు.