పబ్జీ ఆడుతూ అదృశ్యమైన బాలుడు ..పబ్జీ ఎఫెక్ట్ అంటున్న తల్లిదండ్రులు
చాలా పాపులర్ అయిన ఆన్లైన్ గేమ్ పబ్జీ గేమ్ కు సంబంధించి రోజుకో ఘటన జరుగుతోంది. మొన్నటికి మొన్న ఒక అతను పబ్జీ ఆడుతూ మంచినీళ్లు అనుకొని యాసిడ్ తాగితే, రైల్వే ట్రాక్ పై కూర్చుని పబ్జీ ఆడుతూ రైలు వచ్చేది పట్టించుకోకుండా రైలు ఢీకొని ఇద్దరు మృతి చెందారు. ఇక తాజాగా సిద్దిపేటలో ఒక యువకుడు పబ్జీ ఆడొద్దు అని ఇంట్లో వాళ్ళు మందలించారని ఆత్మహత్యకు పాల్పడితే, పబ్జీ ఆడటానికి మొబైల్ కొనివ్వలేదని మరో యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
పబ్జీ ఆడుకుంటూ ఇంటి నుండి అద్రుశ్యమైన బాలుడు
వరుసగా రోజు ఇన్ని ఘటనలు జరుగుతున్నా పబ్జీ మీద ఉన్న క్రేజ్ యువతలో ఏ మాత్రం తగ్గడం లేదు. చిన్నా పెద్దా తేడా లేకుండా మైమరచిపోతూ దీన్ని ఆడేస్తున్నారు. డిల్లీలోని ఘజియాబాద్ పటేల్ నగర్లో ఇటీవల ఇలా పబ్జీ ఆడుకుంటూ ఓ బాలుడు ఇంటి నుంచి వెళ్లిపోయాడు. అతను ఎక్కడికి వెళ్లాడు అనేది ఇంతవరకు తెలియలేదు. దీంతో అతని తండ్రి రాజేశ్ జయంత్ పోలీసులను ఆశ్రయించారు. ఢిల్లీ లోని ప్రభుత్వ పాఠశాలలో టీచర్ గా పని చేస్తున్న రాజేష్ జయంత్ పదో తరగతి చదువుతున్న తన కుమారుడు అభినవ్ (15) అదృశ్యమయ్యాడని,వారం రోజులు గడుస్తున్నా అతని ఆచూకీ తెలియడం లేదని ఆందోళన చెందుతున్నారు. పోలీసులు పట్టించుకోవటం లేదని ఆరోపిస్తున్నారు.
పబ్జీ వల్లే తమ కుమారుడు అదృశ్యం అయ్యాడంటున్న తల్లిదండ్రులు
పబ్జీ ఆట వల్లే తమ కుమారుడు ఇల్లు విడిచి వెళ్లిపోయాడని వారంటున్నారు. పబ్జీ ఆడటం మొదలుపెట్టినప్పటి నుంచి తమ అబ్బాయి ఆలోచనల్లో మార్పు వచ్చిందని, అతనితో పాటు ఈ గేమ్ ఆడే స్నేహితులు కొందరు ఇల్లు విడిచి రావాలని కోరినట్టు తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఈ కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసులు అదృశ్యం అయిన బాబు గురించి, అతని స్నేహితుల గురించి దర్యాప్తు చేస్తున్నారు. ఇల్లు విడిచి వెళ్ళిన అభినవ్ గతంలో కూడా ఇల్లు విడిచి వెళ్ళాడని కానీ ఒకే రోజులో తిరిగి వచ్చాడని చెప్తున్నారు. గతంలో ఎం ఎస్ ధోనీ బయో పిక్ చూసి ధోనీ ని కలవటానికి ఇంట్లో చెప్పకుండా వెళ్ళాడని, తిరిగి ఒకే రోజులో వచ్చాడనిపోలీసులు చెప్తున్నారు. ఈ కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసులు అభినవ్ పబ్జీ ఆటలో ఎవరితోనో చాట్ చేస్తున్నారని, అలాగే గేమ్ ఆడటానికి డిఫరెంట్ స్క్రీన్ వాడుతున్నాడని గుర్తించారు. అయితే అభినవ్ తండ్రి మాత్రం పబ్జీ వల్లే తన కుమారుడు ఇల్లు వీడి వెళ్ళాడని ఈ ఆటను నిషేధించాలని కోరుతున్నారు. పోలీసులు ఆ బాలుడి కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.
ఆదిలోనే అడ్డుకోండి అంటున్న మానసిక నిపుణులు
అయితే మానసిక నిపుణులు సైతం ఈ ఆన్ లైన్ గేమింగ్ పబ్జీ ఆట ఓ వ్యసనంగా మారుతోందని చెప్తున్నారు. పబ్జీ ఆటపై ప్రస్తుతం గుజరాత్లో నిషేధం కొనసాగుతోంది. అక్కడ పబ్జీ ఆడుతూ కనిపించిన చాలా మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. గుజరాత్ గానే కాకుండా, దేశవ్యాప్తంగా పబ్జీ ఆట పై నిషేధం విధించాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. అయితే మానసిక నిపుణులు పిల్లలకు వ్యసనంగా మారిన తర్వాత కాకుండా ఆదిలోనే పిల్లలు ఈ గేమ్ కు అలవాటు పడకుండా జాగ్రత్త పడాలని సూచిస్తున్నారు.