మసరాత్ ఆలంపై ప్రజాభద్రతా చట్టం: ఎలాంటి విచారణ లేకుండా 2 ఏళ్లు జైలు...!
శ్రీనగర్: గతవారంలో జమ్మూ కాశ్మీర్లో పాకిస్ధాన్ జెండా ఎగరేసిన వేర్పాటువాది మసరాత్ ఆలం భట్ పాకిస్ధాన్కు అనుకూల నినాదాలు చేయడంతో పోలీసులు అరెస్టు చేసిన రిమాండ్కు తరలించిన సంగతి తెలిసిందే. అంతే కాదు, తాజాగా మసరాత్ ఆలంపై దేశంలోనే కఠినమైన ప్రజాభద్రతా చట్టాన్ని పోలీసులు అమలు చేశారు.
ఈ చట్టంతో మసరాత్ ఆలంపై ఎలాంటి విచారణ లేకుండా తక్కువలో తక్కువ రెండు సంవత్సరాల పాటు జైల్లో ఉండాడు. దీంతో పాటు రణబిర్ పీనల్ కోడ్ కింద సెక్షన్ 121 ఏ (దేశంపై యుద్ధానికి ప్రేరేపించడం), 124 (దేశద్రోహం), 120 బి (నేరపూరిత కుట్ర), 147 (అల్లర్లు) ఇంకా చిన్న చిన్న నేరాలు ఆలంపై కేసు నమోదు చేశారు.
మసరాత్ ఆలం పెట్టుకున్న బెయిల్ పిటిషన్పై ఆర్డర్స్ను ఏప్రిల్ 25 వరకు బుడ్గామ్ కోర్టు రిజర్వ్లో ఉంచిన నేపథ్యంలో జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఇద్దరు యువకులను భద్రతా బలగాలు కాల్చి చంపాయంటూ వేర్పాటు వాద నేతలు సయ్యద్ అలీ షా గిలానీ, మస్రత్ దక్షిణ కశ్మీర్లోని హైదర్పురాలో ర్యాలీకి పిలుపునిచ్చారు.
గత నెలలో జైలు నుంచి విడుదలైన మసరాత్ అలం, గిలానీ మద్దతుదారులు ఈ ర్యాలీకి హాజరయ్యారు. ర్యాలీలో పాకిస్తాన్ జెండాను ఊపడమే కాకుండా భారత్కు వ్యతిరేకంగా నినాదాలు ఇచ్చారు. పాక్ జెండాను ప్రదర్శించడమేగాక దేశానికి వ్యతిరేకంగా నినాదాలు చేసినందుకుగాను మసరత్ ఆలం, జిలానీతోపాటు పలువురిపై పోలీసులు అసాంఘిక కార్యకలాపాల నివారణ చట్టం (యూఏపీఏ) కింద కేసు నమోదు చేసి అరెస్టు చేశారు.
ఇటీవలే జమ్మూ కాశ్మీర్లో పీడీపీ-బీజేపీ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత జైలు నుంచి విడుదలైన సంగతి తెలిసిందే. మసరాత్ ఆలం జైలు విడుదలైన సందర్భంగా శ్రీనగర్ విమానాశ్రయం నుంచి హైదర్పొరలోని గిలానీ నివాసం వరకూ పెద్ద ప్రదర్శన కూడా చేశారు.
భారత్ గడ్డపై పాకిస్తాన్ జిందాబాద్ అంటే సహించేది లేదని కేంద్ర హోమ్ మంత్రి రాజ్నాథ్ సింగ్ హెచ్చరించారు. జాతి వ్యతిరేక శక్తులపై కఠినంగా వ్యవహరించాల్సిందిగా జమ్మూకాశ్మీర్ ముఖ్యమంత్రి ముఫ్తీకు ఆయన సూచించారు. కాగా, దేశ వ్యతిరేక కార్యకలాపాలను ఉపేక్షించబోమని కాశ్మీర్ ప్రభుత్వం కూడా స్పష్టం చేసింది.