26, 27 తేదీల్లో యధావిధిగా బ్యాంకులు ... సమ్మె వాయిదాకు కారణం ఇదే
ప్రభుత్వ రంగ బ్యాంకుల కన్సాలిడేషన్ ను వ్యతిరేకిస్తూ అఖిలభారత బ్యాంక్ ఆఫీసర్స్ కాన్ఫెడరేషన్, అఖిలభారత బ్యాంక్ ఆఫీసర్స్ సమాఖ్య, ఇండియన్ నేషనల్ బ్యాంక్ ఆఫీసర్స్ కాంగ్రెస్ మరియు నేషనల్ ఆర్గనైజేషన్ ఆఫ్ బ్యాంక్ ఆఫీసర్స్ రెండు రోజుల బ్యాంకుల బంద్ కు పిలుపునిచ్చారు. ఈ నెల 26 , 27 తేదీల్లో ప్రభుత్వరంగ బ్యాంకులు సమ్మెకు దిగాలని తీసుకున్న నిర్ణయం కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శి రాజీవ్ కుమార్ చొరవతో వాయిదా పడింది. దీంతో 26 ,27 తేదీల్లో యధావిధిగా బ్యాంకుల కార్యకలాపాలు జరగనున్నాయి.
ఢిల్లీలో కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శి రాజీవ్ కుమార్ ప్రభుత్వ రంగ బ్యాంకుల విలీనం వ్యతిరేకిస్తూ ఆందోళన బాట పడతామని, రెండు రోజులపాటు సమ్మె చేస్తామని ప్రకటించిన బ్యాంక్ ఉద్యోగ సంఘాల ప్రతినిధుల బృందంతో భేటీ అయ్యారు. బ్యాంక్ అధికారుల సమాఖ్యలు లేవనెత్తిన అన్ని అంశాలను పరిశీలించేందుకు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయాలని ప్రతినిధుల బృందం కోరారు. దీనికి కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శి రాజీవ్ కుమార్ సానుకూలంగా స్పందించారు.
ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయడానికి సుముఖత వ్యక్తం చేశారు. బ్యాంకు ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని చెప్పడంతో సమ్మెను వాయిదా వేయాలని నిర్ణయించినట్లుగా సమ్మెకు పిలుపునిచ్చిన బ్యాంకు అధికారుల సమాఖ్య నాలుగు సంఘాలు ప్రకటించాయి. రాజీవ్ కుమార్ ఇచ్చిన హామీ మేరకు సమ్మె వాయిదా వేస్తున్నట్లు గా, 26 , 27 వ తేదీన బ్యాంకులు యధావిధిగా పనిచేస్తాయని వారు ప్రకటించారు.
ఇటీవల ఆర్థిక కష్టాల్లో ఉన్న భారతదేశాన్ని గట్టెక్కించేందుకు బ్యాంకుల సంస్కరణలపై దృష్టి పెట్టిన కేంద్ర ప్రభుత్వం పది ప్రభుత్వ రంగ బ్యాంకులను విలీనం చేస్తున్నట్టు ప్రకటించడం ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయిస్ అసోసియేషన్ కు ఏమాత్రం నచ్చలేదు. ఇప్పటికే పని వత్తిడి తో ఇబ్బంది పడుతున్న ఉద్యోగులపై బ్యాంకుల విలీనం తో మరింత భారం పడుతుందని, కొందరు బ్యాంకు ఎంప్లాయిస్ ఉద్యోగాలకు చెక్ పడనుందని బ్యాంకింగ్ ఉద్యోగులు సంక్షోభంలో పడ్డారు. అప్పటినుండి బ్యాంకు ఉద్యోగులు ప్రభుత్వ రంగ బ్యాంకుల ఏకీకరణను వ్యతిరేకిస్తూ తమ నిరసనను తెలియజేస్తూ నే ఉన్నారు.