రూ.2.41లక్షల కోట్ల రుణాల రద్దు: బ్యాంకులపై సీఎం మమత అసంతృప్తి
కోల్కతా: ప్రభుత్వరంగ బ్యాంకులకు చెందిన నిరర్ధక ఆస్తులను మూడేళ్ళలో రూ.2.41 లక్షల కోట్ల రుణాలను రద్దు చేయడంపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ విరుచుకుపడ్డారు. ఈ మేరకు తన ఫేస్బుక్ పోస్టులో ఈ నిర్ణయాన్ని ఆమె తప్పుబట్టారు.
ప్రభుత్వ బ్యాంకులు మూడేళ్లలో రూ.2.41 లక్షల కోట్లు రుణాలను రద్దు చేశాయి. ఈ మేరకు పార్లమెంట్ సాక్షిగా కేంద్ర ఆర్ధిక శాఖ సహయ మంత్రి శివప్రతాప్ శుక్లా మంగళవారం నాడు రాజ్యసభలో లిఖితపూర్వకంగా ప్రకటించారు.
నిరర్ధక ఆస్తులను వసూలు కాని రుణాలను ప్రతి ఏటా బ్యాంకులు తమ బ్యాలెన్స్ షీటును తొలగించడం సాధారణ ప్రక్రియ మాత్రమేనని రాజ్యసభలో మంత్రి ప్రకటించారు.
2014 ఏప్రిల్ నుండి 2017 సెప్టెంబర్ మధ్య ఈ రుణాలను రద్దు చేసినట్టు మంత్రి ప్రకటించారు. ప్రభుత్వ రంగ బ్యాంకులు మొండి బకాయిలను రద్దు చేయడంపై బెంగాల్ సీఎం మమత బెనర్జీ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ లెక్కలు తనను షాక్కు గురిచేశాయంటూ దుయ్యబట్టారు. ఓవైపు రుణాలు అందక రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు.
రైతు రుణాలను రద్దు చేయాలని ఎన్ని విజ్ఞప్తులు చేసినా ప్రభుత్వం పట్టించుకోక పోగా బడాబాబులు తీసుకున్న రుణాలను రద్దు చేస్తారా అంటూ విమర్శించారు. ఈ రుణాలు ఎవరు తీసుకున్నారన్న విషయాన్ని కూడా మంత్రి చెప్పకపోవడంపై మండిపడిన మమతా అసలు ఇదే అతి పెద్ద కుంభకోణం కాదా అని ప్రశ్నించారు