కిరణ్ బేడీకి నిరసన: రాజ్ భవన్ ఎదుట నిద్రించిన ముఖ్యమంత్రి, మంత్రులు
పుదుచ్చేరి: పుదుచ్చేరిలో ముఖ్యమంత్రి వి నారాయణ స్వామి, లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడీల మధ్య పోరు కొనసాగుతోంది. లెఫ్టినెంట్ గవర్నర్ తీరును నిరసిస్తూ ముఖ్యమంత్రి, మరికొందరు మంత్రులు బుధవారం రాత్రి మొత్తం రాజ్ భవన్ ఎదుట నిద్రించారు.
ప్రభుత్వం, గవర్నర్ వివాదంతో పుదుచ్చేరి అట్టుడుకుతోంది లెప్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడి ప్రభుత్వ పాలనలో జోక్యం చేసుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొద్ది రోజుల క్రితం పుదుచ్చేరి ప్రభుత్వం హెల్మెట్ను తప్పనిసరిగా ధరించాలనే నియమాన్ని తీసుకొచ్చింది. అయితే ఈ నిర్ణయాన్ని తక్షణమే పాటించాలంటూ కిరణ్ బేడి ప్రజలను ఒత్తిడి చేస్తుండటంతో సర్వత్రా నిరసనలు వ్యక్తమయ్యాయి.
కిరణ్ బేడి చర్యలను వ్యతిరేకిస్తూ పుదుచ్చేరి ముఖ్యమంత్రి నారాయణ స్వామి రాజ్భవన్ ముట్టడి, ధర్నాకు పిలుపునిచ్చారు. సాక్షాత్తు ముఖ్యమంత్రే ధర్నాకు పిలుపున్వివడంతో రాష్ట్రంలో ఉద్రిక్తత నెలకొంది. ధర్నాలో భాగంగా బుధవారం నారాయణ స్వామి రాజ్ భవన్ ఎదుట రోడ్డు మీద నిద్రించారు.
ముఖ్యమంత్రికి మద్దతుగా మంత్రులు, కార్యకర్తలు కూడా అక్కడే బైఠాయించారు. దీనిపై నారాయణ స్వామి మాట్లాడుతూ.. ప్రజలకు సంబంధించి ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలను దశల వారిగా అమలు చేయాలని, అంతేతప్ప తక్షణమే జరిగిపోవాలంటూ ప్రజలను ఇబ్బంది పెట్టకూడదని, కిరణ్ బేడి చర్యల వల్ల ప్రజల్లో మాపై వ్యతిరేకత పెరిగే అవకాశం ఉందని, అందుకే ఆమె చర్యలను వ్యతిరేకిస్తూ రాజ్భవన్ ముట్టడి, ధర్నాకు పిలుపునిచ్చానని చెప్పారు. ప్రధాని మోడీ ఆదేశాల మేరకు ఆమె పని చేస్తున్నారన్నారు.