తమిళిసై చేతుల్లో కాంగ్రెస్ సర్కార్ భవిష్యత్: బలపరీక్షకు ఆదేశించే ఛాన్స్: ఎల్జీగా ప్రమాణం
పుదుచ్చేరి: కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి లెప్టినెంట్ గవర్నర్గా తమిళిసై సౌందరరాజన్ ప్రమాణ స్వీకారం చేశారు. ప్రస్తుతం తెలంగాణ గవర్నర్గా పని చేస్తోన్న ఆమెకు రాష్ట్రపతి భవన్ పుదుచ్చేరి ఎల్జీగా అదనపు బాధ్యతలను అప్పగించింది. ఇప్పటిదాకా లెప్టినెంట్ గవర్నర్గా ఉన్న కిరణ్ బేడీని అర్ధాంతరంగా తొలగించి.. ఆ స్థానంలో తమిళిసైని నియమించింది. ఒకట్రెండు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కొనబోతోన్న సమయంలో కిరణ్ బేడీ భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తోన్నారంటూ అధికార కాంగ్రెస్ పార్టీ చేసిన ఫిర్యాదులను దృష్టిలో ఉంచుకుని రాష్ట్రపతి భవన్ ఈ నిర్ణయాన్ని తీసుకుంది.
ప్రమాణ స్వీకారం చేసిన తమిళిసై
కొద్దిసేపటి కిందటే రాజ్ నివాస్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో తమిళిసై సౌందరరాజన్ ప్రమాణ స్వీకారం చేశారు. మద్రాస్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీబ్ బెనర్జీ ఆమెతో ప్రమాణ స్వీకారం చేయించారు. ముఖ్యమంత్రి వీ నారాయణ స్వామి ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఆమెకు పుష్పగుచ్ఛాన్ని అందించి శుభాకాంక్షలు తెలిపారు. కొత్తగా లెప్టినెంట్ గవర్నర్ రావడంతో.. పుదుచ్చేరి రాజకీయాలు మళ్లీ వేడెక్కాయి. ఈ మధ్యాహ్నం తమిళిసైని రెండు పార్టీల శాసనసభ్యులు కలుస్తారని తెలుస్తోంది.
మైనారిటీలో కాంగ్రెస్ ప్రభుత్వం?
ప్రస్తుతం వీ నారాయణస్వామి సారథ్యంలోని కాంగ్రెస్-డీఎంకే కూటమి ప్రభుత్వం మైనారిటీలో పడిందని, మంత్రి మల్లాడి కృష్ణారావు సహా అధికార పార్టీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలు రాజీనామా చేశారని ప్రతిపక్ష పార్టీలు వాదిస్తున్నాయి. బీజేపీ మిత్రపక్షం ఏఐఏడీఎంకే ఎమ్మెల్యేలు తమిళిసైని కలిసి వినతిపత్రాన్ని ఇవ్వనున్నట్లు సమాచారం. కాంగ్రెస్-డీఎంకే సంకీర్ణ ప్రభుత్వం మైనారిటీలో ఉన్నందున వెంటనే శాసనసభలో బలపరీక్షలకు అవకాశం కల్పించాలంటూ ఏఐఏడీఎంకే, బీజేపీ డిమాండ్ చేస్తోంది.
ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం కల్పించాలంటూ..
దీనిపై తమిళిసై ఎలాంటి నిర్ణయాన్ని తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది. కాంగ్రెస్కు చెందిన యానాం, వల్లియనూర్ ఎమ్మెల్యేలు, మంత్రులు మల్లాడి కృష్ణారావు, ఆర్ముగం నమశ్శివాయమ్ తమ పదవులకు రాజీనామా చేశారు వారిద్దరితో పాటు కాంగ్రెస్కే చెందిన ఎమ్మెల్యేలు తిప్పయిజ్ఞాన్, ఎన్ ధనవేలు సైతం పార్టీకి గుడ్బై చెప్పారు. ఈ పరిస్థితుల్లో నారాయణస్వామి ప్రభుత్వం మైనారిటీలో పడిందని, ఏఐఎన్ఆర్సీ, ఏఐఏడీఎంకే, బీజేపీ వాదిస్తున్నాయి. వెంటనే శాసనసభను సమావేశ పర్చాలని, బలనిరూపణకు అవకాశం కల్పించాలని డిమాండ్ చేస్తోంది.
ఎల్జీతో ముఖ్యమంత్రి భేటీ..
ప్రతిపక్షంలో ఉన్న అఖిల భారత ఎన్ఆర్ కాంగ్రెస్-7, ఏఐఏడీఎంకే-4, బీజేపీ-3 సభ్యులు ఉన్నందున మెజారిటీ తమవైపే ఉందనేది ఆయా పార్టీల వాదన. ఈ పరిణామాల మధ్య తమిళిసై సౌందరరాజన్ను వారంతా ఆ మధ్యాహ్నం కలుస్తారని సమాచారం. మరోవంక- తాజా రాజకీయ పరిణామాలపై ముఖ్యమంత్రి నారాయణ స్వామి ఆమెను కలిసి వివరిస్తారని, ఇదివరకు కిరణ్ బేడి పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించడం వల్ల చెలరేగిన వివాదాలను ఆమె దృష్టికి తీసుకెళ్తారని చెబుతున్నారు. కిరణ్ బేడి భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా, ఏజెంట్గా వ్యవహరిస్తున్నారంటూ అధికార కాంగ్రెస్ పార్టీ కొద్దిరోజులుగా ఆరోపణలను చేస్తూ వస్తోంది.