‘మీ మాజీ సీఎం వారి చెప్పులు మోయడంలోనే ఎక్స్పర్ట్’: నారాయణస్వామిపై మోడీ సంచలనం
పాండిచ్చేరి: ప్రధాని నరేంద్ర మోడీ పుదుచ్చేరి మాజీ సీఎం, కాంగ్రెస్ నేత నారాయణస్వామిపై తీవ్ర విమర్శలు ఎక్కుపెట్టారు. గురువారం కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన మోడీ.. అనంతరం కాంగ్రెస్, ఆ పార్టీ నేతలను ఏకిపారేశారు.
పుదుచ్చేరి ప్రజలు మార్పు కోరుకుంటున్నారు..
త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న పుదుచ్చేరిలో నారాయణస్వామి నేతృత్వంలోని కాంగ్రెస్ సర్కారు కూలిపోయిన విషయం తెలిసిందే. కాంగ్రెస్, డీఎంకే కూటమిలోని ఆరుగురు ఎమ్మెల్యేలు తమ పదవులకు రాజీనామాలు చేయడంతో అసెంబ్లీలో బలం నిరూపించుకోలేక.. ముందే సీఎం పదవికి రాజీనామా చేశారు నారాయణస్వామి. దీంతో ప్రస్తుతం పుదుచ్చేరిలో రాష్ట్రపతి పాలన కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో గురువారం బహిరంగ సభలో మాట్లాడిన ప్రధాని మోడీ.. పుదుచ్చేరి ప్రజలు మార్పును కోరుకుంటున్నారని చెప్పారు.
మీ మాజీ సీఎం వారి చెప్పులు మోయడంలోనే..
నారాయణస్వామి కూటమికి ప్రజా సంక్షేమం కంటే ఇతర విషయాలే ముఖ్యమని ఆరోపించారు. 2016లో పుదుచ్చేరి ఏర్పడిన ప్రభుత్వం కాంగ్రెస్ అధిష్టానం సేవలో బాగా బిజీగా గడిపిందని ఎద్దేవా చేశారు. వారి ప్రాధాన్యతలు వేరేగా ఉంటాయన్నారు.
'మీ మాజీ ముఖ్యమంత్రి తన పార్టీకి చెందిన అగ్రనేతల చెప్పులను ఎత్తడంలో నిపుణుడు కానీ.. పుదుచ్చేరి ప్రజలను పేదరికం నుంచి పైకి తీసుకురావడం మాత్రం ఆయనకు ఇష్టం లేదు' అని ప్రధాని మోడీ తీవ్ర విమర్శలు చేశారు.
మాకు పుదుచ్చేరి ప్రజలే హైకమాండ్
పుదుచ్చేరికి 'హైకమాండ్ ప్రభుత్వం' ప్రభుత్వం అవసరం లేదని.. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ ప్రభుత్వానికి పట్టం కడితే ప్రజలే అధిష్టానంగా పనిచేస్తామని ప్రధాని మోడీ స్పష్టం చేశారు. ఇటీవల రాహుల్ గాంధీ పుదుచ్చేరి పర్యటనలో ఆయన ప్రసంగాన్ని నారాయణస్వామి ప్రసంగం చేసి విమర్శలు ఎదుర్కొన్న విషయం తెలిసిందే. ఈ విషయంపై ప్రధాని మోడీ మాట్లాడుతూ.. కొద్ది రోజుల క్రితం ఓ నిస్సాహాయ మహిళ తనకు ప్రభుత్వం నుంచి సాయం అందలేదని ఫిర్యాదు చేస్తే.. నారాయణస్వామి మాత్రం తనను ప్రశంసించిందని చెప్పుకోవడం విడ్డూరమని అన్నారు. ఆమె కళ్లల్లో, గొంతులో బాధ మిగితా వారందరికీ అర్థమైందని అన్నారు.