నాడు సీఎంగా మన్మోహన్ సింగ్ను నిలదీశావుగా: మోడీ రాజీనామాకు చంద్రబాబు డిమాండ్
అమరావతి: పుల్వామా తీవ్రవాద దాడికి ప్రధాని నరేంద్ర మోడీ బాధ్యత వహించి తన పదవికి రాజీనామా చేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పరోక్షంగా డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన బుధవారం మాట్లాడారు. నరేంద్ర మోడీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో నాటి ప్రధాని మన్మోహన్ సింగ్ పైన చేసిన వ్యాఖ్యలను గుర్తు చేశారు.
పుల్వామా దాడి, యుద్ధమంటూ వాగ్భాణాలు: భారత్-పాక్ బలాబలాలివే, ఎవరివద్ద ఎన్ని?
మన్మోహన్ సింగ్ రాజీనామాకు డిమాండ్ చేశావు
కాశ్మీర్లో తీవ్రవాద దాడులకు నాటి కేంద్ర వైఫల్యమే కారణమని నాడు ప్రధాని మోడీ చెప్పారని, అందుకు బాధ్యత వహిస్తూ మన్మోహన్ సింగ్ రాజీనామాకు డిమాండ్ చేశారని, ఇప్పుడు మోడీ ఏం చేస్తారని నిలదీశారు. తద్వారా మోడీని రాజీనామా చేయాలని పరోక్షంగా డిమాండ్ చేశారు. నాటి డిమాండ్కు ఇప్పుడు మోడీ సమాధానం చెప్పాలన్నారు. పుల్వామా ఘటనను బీజేపీ రాజకీయం చేయాలని చూస్తోందని చెప్పారు.
ఇప్పుడు పాలన మీ చేతిలో
జమ్ము కాశ్మీర్ పాలన, కేంద్ర వ్యవస్థ బీజేపీ చేతిలో ఉందని చంద్రబాబు చెప్పారు. తీవ్రవాదుల కలయికను ఎప్పటికి అప్పుడు పసిగట్టి నివారించ వలసిన బాధ్యత కేంద్రంపై ఉందని చెప్పారు. ఆ రోజు మన్మోహన్ సింగ్ రాజీనామాకు మీరు డిమాండ్ చేసినప్పుడు, మీకు (మోడీ) ఈ రోజు కూడా ఈ మాట వర్తిస్తుందని చెప్పారు. ఆ రోజు సీఎంగా ఉన్న మీరు ప్రధానిని నిలదీశారని, ఇప్పుడు మీరు ప్రధానిగా ఉన్నారని, కాబట్టి మీ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవద్దని మోడీకి సూచించారు.
మన్మోహన్దే బాధ్యత అన్నావుగా
సైనికుల మనోభావాలు కాపాడవలసిన బాధ్యత కేంద్రంపై ఉందని చంద్రబాబు అన్నారు. 'జరిగిన పరిణామాలకు ప్రధానమంత్రి బాధ్యత వహించాలి. పాలనలో జవాబుదారీతనం ఉండాలి. కేంద్ర నిఘా వ్యవస్థలను ప్రతిపక్షాలపై కాకుండా తీవ్రవాదుల కదలికలపై దృష్టిసారించేలా చేసి దాడులు జరగకుండా చేయాల్సిన బాధ్యత కేంద్రంపై ఉంది. ఇది పూర్తిగా కేంద్ర వైఫల్యం.' అని ఆ రోజు మోడీ అన్నారని గుర్తు చేశారు.