పుల్వామా దాడి: ఉగ్రవాదులకు సహకరించిన 23ఏళ్ల ఇన్షా జాన్, ఆమె తండ్రి కూడా
న్యూఢిల్లీ: పుల్వామా దాడిలో జేషే మొహమ్మద్ ఉగ్రవాదులకు సహకరించిన 23ఏళ్ల ఇన్షా జాన్ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ దాడిలో కీలక కుట్రదారు మహ్మద్ ఫరూక్కు ఈ దాడి సమయంలో సహకరించింది. ఎప్పటికప్పుడు ఫోన్ ద్వారా అతనికి సమాచారం చేరవేసింది. సోషల్ మీడియా ద్వారా కూడా అతనితో సంభాషణలు కొనసాగించింది. కాగా, మార్చిలో బాంబులు తయారు ఈ పాకిస్థానీ మహ్మద్ ఉమర్ ఫరూక్ను భద్రతా దళాలు మట్టుబెట్టాయి.
పుల్వామా ప్రధాన కుట్రదారుతో ఇన్షా జాన్ సందేశాలు పంచుకున్నట్లు తాము గుర్తించామని ఎన్ఐఏ ఛార్జీషీటులో పేర్కొంది. 13,500 పేజీలతో ఎన్ఐఏ ఛార్జీషీటును సమర్పించిన విషయం తెలిసిందే. ఉగ్రవాదులతో ఇన్షా జాన్కు సంబంధం ఉన్నట్లు ఆమె తండ్రి తారీఖ్ పిర్కు కూడా తెలుసని ఎన్ఐఏ పేర్కొంది.
పుల్వామా దాడి సమయంలో ఉమర్ ఫరూక్ తోపాటు మరో ఇద్దరు ఉగ్రవాదులకు తారీఖ్ పిర్.. వసతి ఏర్పాటు చేశారని ఎన్ఐఏ తెలిపింది. పుల్వామా ఉగ్రదాడిలో కీలక సూత్రధారులైన ఉమర్ ఫరూఖ్, సమీదర్ దార్, అదిల్ అహ్మద్ దార్లకు తండ్రీకూతుళ్లు తారీఖ్ పిర్, ఇన్షా జాన్లు భోజనం, వసతి కల్పించారు. 15 సందర్భాలకుపైగా ఉగ్రవాదులకు వీరు సహాయాన్ని అందించారు. 2018, 2019 మధ్య కాలంలో ఈ ఉగ్రవాదులకు తండ్రీకూతుళ్లు అన్ని సౌకర్యాలు కల్పించారని ఎన్ఐఏ పేర్కొంది.
Recommended Video
కాగా, గత సంవత్సరం ఫిబ్రవరి 14న పుల్వామాలో ఉగ్రవాదులు జరిపిన ఆత్మాహుతి కారు బాంబు దాడిలో 40 మందికిపైగా సైనికులు మరణించిన విషయం తెలిసిందే. అదిల్ అహ్మద్ దార్ ఈ ఆత్మాహుతి దాడికి పాల్పడ్డాడని ఎన్ఐఏ తేల్చింది.