పుల్వామా దాడులు: ఆ దేశ తరహా దాడులు జరుగుతాయని ముందే హెచ్చరించిన ఇంటెలిజెన్స్
జమ్ముకశ్మీర్లో అతిపెద్ద ఉగ్రదాడి జరిగిన విషయం తెలిసిందే. ఈ దాడిలో 44 మంది భారత జవాన్లు అమరులయ్యారు. ఈ దాడికి తెగబడింది జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థ. దాడి గురించి ఇంటెలిజెన్స్ వర్గాలు ముందే హెచ్చరించాయా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఇంటెలిజెన్స్ వర్గాలు ఉగ్రవాదుల దాడిపై ఎప్పుడు హెచ్చరించాయి.... హెచ్చరికలను ఎందుకు పెడచెవిన పెట్టడం జరిగింది...?
ఊడి దాడుల తర్వాత జమ్ముకశ్మీర్లో అతిపెద్ద ఉగ్రదాడి జరిగింది. నాడు ఉడి ఘటనలో 19 మంది జవాన్లు అమరులైతే ... ఈ దాడిలో 44 మంది జవాన్లు అమరులయ్యారు. కారుతో ప్రయాణిస్తూ ఓ ఆత్మాహుతి దాడి జరిగే అవకాశం ఉందని ఇంటెలిజెన్స్ వర్గాలు కొద్దిరోజుల క్రితం హెచ్చరించాయని విశ్వసనీయవర్గాల సమాచారం. ఇంటెలిజెన్స్ వర్గాల సమాచారం ఇవ్వడంతో ఉన్నతాధికారులు ఈ ముప్పును ఎలా తిప్పికొట్టాలో అనేదానిపై కూడా సమావేశమై చర్చించారు. చర్చలు అయితే జరిగాయి కానీ... సమస్యకు ఎలాంటి పరిష్కారం కనుగొనకుండానే సమావేశం ముగిసింది.
ఇలాంటి దాడులను ఎలా ఎదుర్కొనాలో అనేదానిపై కొన్ని సూచనలు చర్చిండం జరిగింది. వీటిని భద్రతా బలగాలకు సీఆర్పీఎఫ్కు కూడా చెప్పడం జరిగిందని తెలుస్తోంది. ఇక సీఆర్పీఎఫ్ కాన్వాయ్ లక్ష్యంగా జరిగిన జైషే మహ్మద్ ఉగ్రదాడిలో 44 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు మృతి చెందారు. ఈ దాడి ఎలా జరిగిందన్న విషయాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తే... ఓ విషయం అర్థమవుతుంది. ఈ దాడులు సిరియా, అఫ్ఘానిస్తాన్లో జరిగే కారు దాడుల్లానే జరిగినట్లు అర్థమవుతుంది. ఆ రెండు దేశాల్లో చాలావరకు ఉగ్రదాడులు కారును ఉపయోగించే జరిగాయి. ఇక తాజాగా పుల్వామాలో జరిగిన దాడులు కూడా ఇదే తరహా దాడిని తలపిస్తున్నాయి.
కారుతో దాడులు చేయొచ్చనే ఇంటెలిజెన్స్ సమాచారం రావడంతో వాహనాలను తనిఖీచేసే పంపించాం కానీ ఎక్కడో లెక్క తప్పిందని అధికారులు చెబుతున్నారు. అయితే ఇంటెలిజెన్స్ వర్గాలు సమాచారం ఇచ్చిన తర్వాత జరిగిన సమావేశంలో ఓ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. మిలటరీ కాన్వాయ్లను రాత్రి సమయాల్లో తరలించాలని భావించినట్లు అధికారులు తెలిపారు. ఆ సమయంలో ట్రాఫిక్ కూడా ఉండదు కాబట్టి త్వరగా గమ్యస్థానానికి చేరుకోవచ్చనే అభిప్రాయంతో తామంతా ఉన్నట్లు వెల్లడించారు.
ఇక ఆసమయంలో తక్కువ వాహనాలు ఉంటాయి కాబట్టి తనిఖీల నిర్వహణ కూడా సులభతరమవుతుందని భావించినట్లు అధికారులు చెప్పారు. ఇక పగటి వేళల్లో ట్రాఫిక్ ఎక్కువగా ఉండటం వల్ల తనిఖీల నిర్వహణకు చాలా సమయం పడుతుందని చెప్పారు అధికారులు. రాత్రి సమయాల్లో అయితే రోడ్ పార్టీలు లైట్లను వెలిగించి అనుమానిత వ్యక్తులను కానీ వాహనాలను కానీ పట్టుకోవచ్చని చెప్పారు.
ఇది అమలు చేసేలోపే జరగాల్సిన నష్టం జరిగిపోయిందన్నారు ఉన్నతాధికారులు. ఇలాంటి దాడులు ఎప్పుడూ జరగలేదని వెల్లడించారు.