పుల్వామా దాడి: పలుచోట్ల కాశ్మీరీలకు వేధింపు, సీఆర్పీఎప్ హెల్ప్లైన్.. డోర్లు ఓపెన్ చేశామని..
శ్రీనగర్: పుల్వామాలో తీవ్రవాదుల దాడిలో నలభై మందికి పైగా జవాన్లు అమరులయ్యారు. దీనిపై యావత్ భారతదేశం కన్నీరుమున్నీరు అవుతోంది. కానీ కొందరు మాత్రం దేశానికి వ్యతిరేకంగా, జవాన్లకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. సోషల్ మీడియాలోను జవాన్ల మృతికి సంతోషం వ్యక్తం చేస్తున్నట్లుగా పేర్కొంటున్నారు. ఇది యావత్ భారతావనికి ఆగ్రహం తెప్పిస్తోంది.
జవాన్ల మృతికి సంతాపంగా దాదాపు ప్రతి గ్రామం, పట్టణంలో క్యాండిల్ ర్యాలీలు, సంతాపాలు ప్రకటించారు. జవాన్లకు, దేశానికి వ్యతిరేకంగా కొందరి చర్యలపై ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి.
ఇదిలా ఉండగా, పుల్వామా దాడి నేపథ్యంలో దేశంలోని పలు ప్రాంతాల్లో కాశ్మీరు విద్యార్థులపై కొందరు వేధింపులకు దిగినట్లుగా తెలుస్తోంది. ఇలాంటివి ఒకటి రెండు చిన్న సంఘటనలు చోటు చేసుకున్నాయి. కాశ్మీరి యువతకు వేధింపుల పిర్యాదుల అంశం తమ దృష్టికి రాగానే సీఆర్పీఎఫ్ రంగంలోకి దిగింది. సీఆర్పీఎఫ్ హెల్ప్లైన్ను ప్రారంభించింది.
కాశ్మీర్కు చెందిన విద్యార్థులు లేదా సాధారణ ప్రజలు ఎవరైనా సీఆర్పీఎప్ మదద్గర్ (CRPFmadadgaar)కు ఏ సమయంలోనైనా (24x7) ఫోన్ చేయవచ్చునని, కాశ్మీరీలకు అండగా ఉంటామని హెల్ప్ లైన్ నెంబర్లు ఇచ్చారు. 14411 కు ఉచితంగా కాల్ చేయవచ్చు. లేదా 7082814411 కు సందేశం (ఎస్సెమ్మెస్) పంపించవచ్చు.
కాశ్మీర్కు చెందిన యువత దేశంలోని పలుచోట్ల చదువుకుంటోంది. పుల్వామా దాడి నేపథ్యంలో, సోషల్ మీడియాలో కొందరు వ్యతిరేక ప్రచారం నేపథ్యంలో ఒకడి రెండు చోట్ల కాశ్మీరీలు వేధింపులకు గురయ్యారు. దీంతో సీఆర్పీఎఫ్ వెంటనే హెల్ప్ లైన్ ప్రారంభించింది.
అంతేకాదు, ఎవరైనా ఆగ్రహంతో దాడి చేసేందుకు వస్తే కాపాడేందుకు తాము సిద్ధంగా ఉన్నామని కూడా ట్వీట్లు చేస్తున్నారు. డెహ్రాడూన్లో 15 నుంచి 20 మంది కాశ్మీరీ విద్యార్థులను ఓ హాస్టల్లో ఉంచారు. ఆ హాస్టల్ వద్దకు కొందరు వచ్చి వారిని ఇక్కడి నుంచి బయటకు పంపించాలని డిమాండ్ చేశారు.
కాశ్మీరీలు ఎవరైనా ఇబ్బందిపడితే తమ డోర్లు ఎప్పుడూ ఓపెన్ చేసి ఉంటాయని ముంబై, ఢిల్లీ, నోయిడాకు చెందిన పలువురు ఆఫర్ చేస్తూ ట్వీట్ చేస్తున్నారు.
ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడం, వారికి షెల్డర్ ఇవ్వడం హిందువులకు మొదటి నుంచి ఉన్న గుణమని, ఇప్పుడు కాశ్మీరీ విద్యార్థులకు కూడా షెల్టర్ ఇచ్చేందుకు తమ డోర్లు ఓపెన్గా ఉంటాయని శంకర్షన్ థాకూర్ అనే వారు ట్వీట్ చేశారు.
ఢిల్లీకి చెందిన మధుర్ వర్మ అనే వారు ట్వీట్ చేస్తూ.. తాను ఢిల్లీలో ఉంటానని, తన ఇంటి నెంబర్ ఇది అని, ఏ జమ్ము కాశ్మీర్ వ్యక్తి అయినా తమ ఇంటికి వచ్చి ఉండవచ్చునని పేర్కొన్నారు. పుల్వామా దాడి దారుణమని, కానీ కొంతమంది కాశ్మీరీలను టార్గెట్గా చేసుకోవడం సరికాదని నాగేంద్ర శర్మ అనే వారు ట్వీట్ చేశారు.