Pulwama attack: కీలక అడుగు - 5వేల పేజీలతో ఎన్ఐఏ చార్జిషీట్ - మాస్టర్మైండ్ మసూద్ అజార్
భారత సాయుధ బలగాలపై జరిగిన అత్యంత భయానకదాడిగా చరిత్రకెక్కిన 'పుల్వామా ఉగ్రదాడి' కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. భారత్, పాక్ మధ్య యుద్ధ పరిస్థితులకూ దారి తీసిన ఈ ఘటనపై జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) ఏడాదిన్నరపాటు లోతైన విచారణ జరిపింది. ఈ మేరకు లభించిన ఆధారాలతో మొత్తం 5వేల పేజీలతో కూడన చార్జిషీటును జమ్మూలోని ఎన్ఐఏ కోర్టుకు మంగళవారం సమర్పించనుంది. గతేడాది ఫిబ్రవరి 14న జమ్మూ-శ్రీనగర్ హైవేపై 40 మంది సీఆర్పీఎఫ్ జవాన్లను బలితీసుకున్న ఆ దాడికి సంబంధించి చార్జిషీటులో సంచలన విషయాలు పేర్కొన్నారు.
ఆజాద్.. 45 ఏళ్ల గులాంగిరీకి ఇదా బహుమానం? ముస్లిం కాబట్టేగా - అసదుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
పుల్వామా దాడికి సంబంధించి ఎన్ఐఏ చార్జిషీటులో మోడస్ ఆపరెండీపై సమగ్రవివరాలను పొందుపర్చినట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఉగ్రదాడుల ప్రణాళికతోపాటు పాకిస్తాన్ నుంచి దాన్ని ఎలా అమలు చేశారు, ఎవరెవరు ఎలాంటి పాత్రను నిర్వహించారనే విషయాలను చార్జిషీటులో క్షుణ్నంగా పేర్కొన్నారు. ఈ కేసులో జైష్-ఎ-మొహమ్మద్ చీఫ్ మసూద్ అజర్, అతని సోదరుడు రవూఫ్ అస్గర్ సహా 20 మంది నిందితులపై ఎన్ఐఏ తిరుగులేని ఆధారాలు సేకరించినట్లు తెలుస్తోంది.
అప్పటిదాకా జరిగిన ఉగ్రదాడుల్లో మెజార్టీ ఘటనలు పాకిస్తాన్ జాతీయులు భారత్ కు వచ్చి చేసినవికాగా, పుల్వామా దాడిలో మాత్రం తొలిసారి స్థానిక ఫిదాయితో జరిపించారు. సూసైడ్ బాంబర్ ఆదిల్ అహ్మద్ దార్ కారులో పేలుడు పదార్థలను నింపుకొని, గతేడాది ఫిబ్రవరి 14న సీఆర్పీఎఫ్ కాన్వాయ్ పై దాడి చేయగా, మొత్తం 40 మంది జవాన్లు చనిపోయారు. కాగా, దాడిలో వాడి ఆర్డీఎక్స్ పాకిస్తాన్ నుంచే దిగుమతి అయినట్లు ఎన్ఐఏ గుర్తించింది. అక్కణ్నుంచి మాస్టర్ మైండ్స్ నిత్యం అహ్మద్ దార్ తో జరిపిన చాటింగ్, మెసేజ్ వివరాలతోపాటు పేలుడు పదార్థాల రవాణాకు సంబంధించిన ఫొటోలను సైతం ఎన్ఐఏ సేకరించగలిగింది. ఈ ఆధారాలన్నింటినీ 5వేల పేజీల చార్జిషీట్ రూపంలో కోర్టు ముందుంచనుంది.
Recommended Video
ఈ కేసులో చివరిగా జులైలో బిలాల్ అహ్మద్ కుచేరీ అనే వ్యక్తిని ఎన్ఐఏ అరెస్టు చేసింది. లేత్పొరాలో ఫర్నీచర్ దుకాణం, రంపం మిల్లుల ఓనరైన కుచేరి.. ఫిదాయి అహ్మద్ దార్ కు ఆశ్రయం కల్పించడంతోపాటు పాకిస్తాన్ లోని మాస్టర్ మైడ్స్ తో మాట్లాడేందుకు అత్యాధునిక ఫోన్లను సైతం కొనిచ్చాడని ఏన్ఐఏ పేర్కొంది. దాడికి పేలుడు పదార్థాలు సమకూర్చిన ఉమర్ ఫారూఖ్, పాత్రధారి అహ్మద్ దార్ దాడి చేయడానికి ముందు అతనికి ఆశ్రయమిచ్చిన తారీఖ్ అహ్మద్ షా, అతని కూతురు ఇషా జాన్, మొహ్మద్ అబ్బార్, వయీజ్ ఉల్ ఇస్లామ్ తదితర 20 మంది పేర్లను నిదితుల జాబితాలో చేర్చారు.