పుల్వామా దాడి: ఆధారాలు సమర్పించినా ఉగ్రవాది మసూద్ అజార్కు పాక్ మద్దతు
న్యూఢిల్లీ: పుల్వామా ఉగ్రదాడి కేసులో పాకిస్థాన్కు సరైన ఆధారాలు సమర్పించినప్పటికీ.. ఈ కేసులో ప్రధాన నిందితుడు, జైషే మహ్మద్ ఉగ్ర సంస్థ అధినేత మసూద్ అజార్కు మద్దతిస్తూనే ఉందని భారత విదేశాంగ శాఖ మీడియాకు వెల్లడించింది. అజార్కు పాకిస్థాన్ ఆశ్రయం కల్పిస్తూనే ఉందని పేర్కొంది.
2008 ముంబై దాడులకు పాల్పడిన వారిని వెనకేసుకొచ్చినట్లే అజార్ విషయంలోనూ పాకిస్థాన్ అదే వైఖరిని ప్రదర్శిస్తోందని భారత్ ఆగ్రహం వ్యక్తం చేసింది. 155 మంది విమాన ప్రయాణికులను హైజాక్ చేసిన తర్వాత.. వారిని విడిపించుకునే క్రమంలో భారత జైలు నుంచి విడుదలయ్యాడు మసూద్ అజార్.
అనంతరం 2000లో జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థను స్థాపించాడు. 2019, ఫిబ్రవరి 14న పుల్వామాలో జరిగిన ఆత్మాహుతి దాడి కేసులో ఇప్పటికే ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు. ఈ దాడి కేసులో అజార్ ప్రధాన నిందితుడు ఉన్నాడు. అజార్ సోదరుడు అబ్దుల్ రవూఫ్ అస్ఘర్, మరణించిన ఉగ్రవాది మహ్మద్ ఉపర్ ఫరూఖ్, ఆత్మాహుతి దళ సభ్యుడు అదిల్ అహ్మద్ దార్, అల్వీ, ఇస్మాయిల్ తదితర పాక్ మూలాలున్న ఉగ్రవాదులపై ఎన్ఐఏ ఇటీవల ఛార్జీషీటు దాఖలు చేసింది.
పుల్వామాలో భద్రతా బలగాల కాన్వాయ్ను పేలుడు పదార్థాలు నింపిన కారుతో ఢీకొన్న ఘటనలో 40 మందికిపైగా భారత జవాన్లు మరణించిన విషయం తెలిసిందే. ఈ దాడికి తామే బాధ్యులమని జైషే మహ్మద్ ఉగ్రవాదులు ప్రకటించారు.
పుల్వామా ఘటనకు ప్రతీకారంగా భద్రతా దళాలు ఉగ్రవాదులను భారీ మొత్తంలో ఏరివేశాయి. ఈ కేసుకు సంబంధించిన ఉగ్రవాదులను కొందరిని హతమార్చగా.. మరికొందరిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఉగ్రవాదులకు సహకరించిన ఇన్షా జాన్ అనే 23ఏళ్ల యువతిని అదుపులోకి తీసుకున్న ఎన్ఐఏ ఆమెను విచారిస్తోంది.