ఆ రాక్షసులను క్షమించకూడదు: గళమెత్తిన భారతీయులు, పరోక్ష యుద్ధం.. మోడీ తొలిదెబ్బ
న్యూఢిల్లీ: జమ్ము కాశ్మీర్లోని పుల్వామాలో జరిగిన తీవ్రవాద దాడిపై భారత్ తీవ్రంగా స్పందిస్తోంది. దేశంలోని ప్రజలు ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. పాకిస్తాన్ పైన ప్రతీకారం తీర్చుకోవాల్సిందేనని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. 2016 సర్జికల్ స్ట్రయిక్స్ చేశారని, ఇప్పుడు మరోసారి చేయాలని ప్రధాని మోడీకి విజ్ఞప్తులు చేస్తున్నారు.
పాకిస్తాన్ పైన యుద్ధం ప్రకటించాలని కూడా డిమాండ్ చేస్తున్నారు. దాయాది దేశాన్ని ఉపేక్షించి లాభం లేదని చెబుతున్నారు. అటువైపు నుంచి సరైన స్పందన లేనప్పుడు మనం శాంతిగా ఉండటంలో అర్థం లేదని అంటున్నారు. చాలామంది వీరజవాన్లకు సోషల్ మీడియా, తమ తమ వాట్సాప్ స్టేటస్లలో నివాళులు అర్పిస్తూనే, ప్రతీకారం తీర్చుకోవాలని చెబుతున్నారు.
అప్పుడే మోడీ పరోక్ష యుద్ధం
మూడేళ్ల క్రితం సర్జికల్ స్ట్రయిక్స్ ద్వారా పాకిస్తాన్కు దిమ్మతిరిగే షాకిచ్చిన నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈసారి వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. అత్యంత ప్రాధాన్యత దేశాల జాబితా నుంచి.. పాకిస్తాన్ను తొలగించినట్లు కేంద్రమంత్రి అరుణ్ జైట్లీ శుక్రవారం ప్రకటించారు. పాకిస్తాన్కు మోస్ట్ ఫేవర్డ్ నేషన్ హోదాను ఉపసంహరించుకోవాలని నిర్ణయించామని చెప్పారు. తద్వారా పాక్ను ఏకాకి చేసేందుకు అన్ని చర్యలు తీసుకుంటామని చెప్పారు. పాక్ ఇలా చేస్తే భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. ప్రధాని మోడీ కూడా 130 కోట్ల మంది భారతీయులు దీటైన జవాబిస్తారని, భద్రతాబలగాలకు పూర్తి స్వేచ్ఛను ఇచ్చామని చెప్పారు. మోస్ట్ ఫేవర్డ్ నేషన్ జాబితా నుంచి తొలగించడం ద్వారా పరోక్ష యుద్ధం ప్రారంభించారు. అమరుల కుటుంబాలకు తాము అండగా ఉంటామని రాజ్ నాథ్ సింగ్ చెప్పారు.
భారతీయుల ఆగ్రహం
పుల్వానా దాడి పైన కోట్లాది మంది భారతీయులు తమ ఆగ్రహావేశాలను సోషల్ మీడియాలో పోస్టులు, వాట్సాప్ స్టేటస్లు పెట్టడం ద్వారా వ్యక్తం చేస్తున్నారు. అలాగే, సీఆర్పీఎఫ్ జవాన్లకు పట్టణాలు, గ్రామాల కూడళ్లలో నివాళులు అర్పిస్తూ, తీవ్రవాదానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పలువురు ప్రముఖులు కూడా తమ తమ ఆగ్రహాన్ని వెలిబుచ్చారు. పలు స్కూళ్లలో కొవ్వొత్తులతో సంతాపం వ్యక్తం చేశారు.
దాడి తెలిసి షాకయ్యాం
ఉగ్రదాడిలో జవాన్లు ప్రాణాలు కోల్పోయారని తెలిసి చాలా బాధేసిందని, వారి కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానని నటుడు మహేష్ బాబు పేర్కొన్నారు. జవాను కుటుంబ సభ్యులకు మనస్ఫూర్తిగా సంతాపం వ్యక్తం చేస్తున్నానని, ప్రతి జవాను త్యాగాన్ని గుర్తు పెట్టుకుంటామని అల్లు అర్జున్, ఈ ఘటన విని షాకయ్యానని నటుడు రానా, ఉగ్రవాదులు దారుణానికి పాల్పడ్డారని, జవాను కుటుంబీకులకు సంతాపం తెలియజేస్తున్నానని నటుడు గోపీచంద్, దారుణం.. అమరుల కుటుంబాలకు సానుభూతి అని అనుష్క, చాలా బాధవేసిందని నటుడు సూర్య పేర్కొన్నారు.
వారిని క్షమించకూడదు
రాక్షసులు మళ్లీ చెలరేగిపోయారని, ఏమాత్రం సహించకూడదని రితేశ్ దేశ్ముఖ్, జనాన్ల త్యాగం చూస్తుంటే గుండె తరుక్కుపోతుందని సల్మాన్ ఖాన్, ఎందరో జవాన్ల ప్రాణాలు తీసి, వారి కుటుంబాలకు తీరని శోకం మిగిల్చిన వారిని క్షమించకూడదని, ఈ నష్టాన్ని తట్టుకునే శక్తి వారి కుటుంబాలకు ప్రసాదించాలని ఆ దైవాన్ని ప్రార్థిస్తున్నానని, వారి కోసం ప్రతీ భారతీయుడు ప్రార్థిస్తుంటాడని నటుడు సోనూ సూద్ పేర్కొన్నారు.