మరో పుల్వామా దాడిని భగ్నం చేసిన భద్రతా దళాలు: కారు పేల్చేశారు(వీడియో)
శ్రీనగర్: ప్రపంచమంతా కరోనా మహమ్మారితో పోరాటం చేస్తుంటే మనదేశం మాత్రం కరోనాతోపాటు ఉగ్రవాదంతోనూ పోరాటం కొనసాగిస్తోంది. మరోవైపు చైనా, నేపాల్ కుట్రలను సైతం ఎదుర్కొంటోంది. తాజాగా, ఉగ్రవాదులు పుల్వామా తరహాలో దాడికి పన్నిన భారీ కుట్రను భద్రతా దళాలు భగ్నం చేశాయి.
చివరి నిమిషంలో పేలడానికి సిద్ధంగా ఉన్న కారు బాంబును భద్రతా దళాలు గుర్తించి ధ్వంసం చేశాయి. సీఆర్పీఎఫ్, ఆర్మీ, పోలీసులు సంయుక్తంగా ఈ ఆపరేషన్ నిర్వహించాయి. కాగా, 2019లో 40 మంది సీఆర్పీఎఫ్ జవాన్లను ఉగ్రవాదులు ఆత్మాహుతి దాడితో పొట్టనపెట్టుకున్న విషయం తెలిసిందే.
బాంబు అమర్చిన కారులో ఓ ఉగ్రవాది సంచరిస్తున్నట్లు పుల్వామా పోలీసులకు సమాచారం వచ్చింది. దీంతో అప్రమత్తమైన పోలీసులు, భద్రతా సిబ్బంది బృందాలుగా ఏర్పడి తనిఖీలు నిర్వహించింది. బుధవారం రాత్రి ఒక చోట ఆ వాహనం కోసం వేచి చూశారు.
#Pulwama-like attack averted as security forces defuse 20Kg IED recovered from a car in Pulwama . pic.twitter.com/hQT7zHE1SQ
— Alpha Wolf (@AlphaWo40963407) May 28, 2020
కాగా, కాసేపటికే అనుమానిత వాహనం అక్కడకు చేరింది. దీంతో వెంటనే బలగాలు దానిపై కాల్పులు జరిపాయి. దీంతో వాహనంలో ఉన్న వ్యక్తి పారిపోయాడు. అయితే, వాహనం వెనుక భారీ డ్రమ్ములో పేలుడు పదార్థాలు అమర్చినట్లు గుర్తించారు.
వెంటనే బాంబు నిర్వీర్య బృందాలను పిలిపించారు. వారు అక్కడికి వచ్చి భారీ ప్రమాదం ఉందని తేల్చారు. ఈ క్రమంలో అక్కడి స్థానికులను దూరంగా తరలించిన భద్రతా దళాలు... ఆ కారును పేల్చేశాయి. దీంతో మరో పుల్వామా దాడి జరగకుండా భదతా బలగాలు అడ్డుకున్నాయి.