పుల్వామా టెర్రర్ దాడిపై మాజీ రా చీఫ్ ఏమన్నారంటే? పాక్కు గుణపాఠం చెప్పేందుకు సిద్ధం.. ధనోవా
న్యూఢిల్లీ/హైదరాబాద్: జమ్ము కాశ్మీర్లోని పుల్వామా తీవ్రవాద దాడిపై మాజీ 'రా' చీఫ్ విక్రమ్ సూద్ ఆదివారం స్పందించారు. ఇలాంటి సంఘటనల్లో భద్రతాపరమైన లోపాలు కూడా ఉండి ఉంటాయని అభిప్రాయపడ్డారు. అక్కడ ఏం జరిగిందో తనకు తెలియదని, కానీ ఇలాంటి విషాద సంఘటనలు మాత్రం కొన్ని సందర్భాల్లో భద్రతాపరమైన లోపాలు లేకుండా జరగవని చెప్పారు.
ఈ తీవ్రవాద దాడిలో ఒకరి కంటే ఎక్కువ మంది పాత్ర ఉంటుందని చెప్పారు. పేలుడు పదార్థాలు తీసుకు వచ్చి ఆత్మాహుతి చేసుకున్న వ్యక్తితో పాటు మరికొందరికి ఇందులో పాత్ర ఉంటుందని చెప్పారు. కొందరు కలిసి ఈ దాడికి ప్లాన్ వేసి ఉంటారని చెప్పారు. ఎవరో కారును తీసుకు వచ్చి ఇచ్చి ఉంటారని, అలాగే మరికొందరికి సీఆర్పీఎఫ్ జవాన్ల వాహనాలకు సంబంధించిన సమాచారం తెలిసి ఉంటుందన్నారు.
సీఆర్పీఎఫ్ జవాన్లు ఎక్కడి నుంచి ఎక్కడకు వెళ్తున్నారో వారు తెలుసుకొని ఉంటారని అన్నారు. కచ్చితంగా కొంతమంది కలిసి ఈ దాడికి పాల్పడ్డారని చెప్పారు. ఆత్మాహుతి దాడి చేసిన వ్యక్తి ఒక్కడే దీనిని చేయలేడని చెప్పారు. కానీ ఇదే జరిగింది, ఇది జరగలేదని ఇప్పుడే చెప్పలేమన్నారు.
ఇది బాక్సింగ్ మ్యాచ్ కాదని, ప్రధాని నరేంద్ర మోడీ ఎలా అయితే స్పందించారో అలాంటి స్పందన కావాలన్నారు. ఉగ్రవాది దాడి నేపథ్యంలో సమయం, ప్రాంతం మీరే ఎంచుకోండని సైన్యానికి ప్రధాని చెప్పారని గుర్తు చేశారు.
మరోవైపు, రోజు ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పిస్తూ దేశంలో దాడులకు పాల్పడుతున్న పాకిస్థాన్కు బుద్ధి చెప్పేందుకు భారత్ సిద్ధమవుతోంది. అంతర్జాతీయ సమాజంలో పాక్ను ఏకాకిని చేసేందుకు చర్యలకు సిద్ధమవుతోంది. పాకిస్థాన్కు తగిన గుణపాఠం చెప్పేందుకు తాము సిద్ధంగా ఉన్నామని వైమానిక దళాధిపతి బీఎస్ ధనోవా అంతకుముందు రోజు తెలిపారు. ప్రభుత్వం ఆదేశాలు అందితే ఏ క్షణమైనా దాడులకు తాము సిద్ధమన్నారు. రాజస్థాన్లోని పోక్రాన్లో జరుగుతున్న వాయుశక్తి 2019 ప్రారంభోత్సవం సందర్భంగా ఆయన పాక్పై పరోక్ష వ్యాఖ్యలు చేశారు.
ప్రభుత్వం ఆదేశిస్తే ఎలాంటి చర్యలు చేపట్టేందుకైనా భారత వైమానిక దళం ప్రతిక్షణం సిద్ధంగా ఉందని, తమ మిషన్లను అమలు చేయడంతో తాము ఎల్లప్పుడూ ముందుంటామని, దేశ సౌభ్రాతృత్వం, భద్రతకు ఎయిర్ ఫోర్స్ కట్టుబడి ఉందని, దేశ రక్షణ కోసం ఎలాంటి సవాళ్లనైనా ఎదుర్కొనే సామర్థ్యం వైమానిక దళానికి ఉందని ఈ దేశ ప్రజలకు హామీ ఇస్తున్నామని చెప్పారు. యుద్ధం అనేది రెండు లేదా కొన్ని దేశాల మధ్య జరుగుతుందని, అయితే మనలను నేరుగా గెలవలేమని మన శత్రు దేశానికి తెలుసునని, అందుకే ఇలా దొంగదెబ్బ తీయాలని చూస్తున్నారని మండిపడ్డారు.