పట్టాలెక్కిన వందే భారత్ ఎక్స్ ప్రెస్.. సాదా సీదాగా ప్రారంభ కార్యక్రమం: ఉగ్రదాడికి నివాళిగా
న్యూఢిల్లీ : రైల్వే మంత్రిత్వశాఖ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా రూపొందించిన వందేభారత్ ఎక్స్ ప్రెస్ శుక్రవారం పట్టాలు ఎక్కింది. ట్రైన్ 18గా పిలిచే ఈ రైలుకు ఇంజిన్ ఉండదు. దీని గరిష్ఠ వేగం 180 కిలోమీటర్లు. ట్రయల్ రన్ లో ఈ రైలు గంటకు 180 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించింది. ప్రయాణికుల కోసం అందుబాటులోకి వచ్చిన తరువాత ఈ రైలు గరిష్ఠ వేగాన్ని 160 కిలోమీటర్లకు పరిమితం చేశారు. న్యూఢిల్లీ-వారణాశి మధ్య వారానికి అయిదు రోజుల పాటు ఈ రైలు రాకపోకలు సాగిస్తుంది.
సోమ, గురు వారాల్లో మినహా మిగిలిన అన్ని రోజుల్లోనూ ఈ రైలు ప్రయాణికులకు అందుబాటులో ఉంటుంది. ఆదివారం నుంచి ఈ రైలు ప్రయాణికుల కోసం వినియోగిస్తారు. టికెట్ల బుకింగ్ ఇదివరకే ఆరంభమైంది. ఈ రైలు ప్రయాణికులకు ఉదయం టీ, అల్పాహారం, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం పూట మరోసారి అల్పాహారాన్ని అందిస్తారు. దీనికి సంబంధించిన ఛార్జీలను రైలు టికెట్ నుంచే వసూలు చేస్తారు.
సాదా సీదాగా ప్రారంభ కార్యక్రమం..
దేశ రాజధాని న్యూఢిల్లీలోని రైల్వేస్టేషన్ లో ఈ ఉదయం ప్రధాని.. జెండా ఊపి ఈ రైలును ప్రారంభించారు. రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయల్, రైల్వే బోర్డు ఛైర్మన్, ఇతర ఉన్నతాధికారులు ప్రధాని వెంట ఉన్నారు. రైలును ప్రారంభించడానికి ముందు ప్రధాని, రైల్వే మంత్రి బోగీలను తనిఖీ చేశారు. ఈ రైలు నిర్మాణానికి చేసిన ఖర్చు, ప్రయాణికుల కోసం ఏర్పాటు చేసిన సౌకర్యాలను వారు అధికారులను అడిగి తెలుసుకున్నారు. జమ్మూ కాశ్మీర్ లోని పుల్వామా జిల్లా అవంతిపురా వద్ద జైషె మహమ్మద్ ఉగ్రవాదు చేసిన దాడిలో 40 సీఆర్పీఎఫ్ జవాన్లు అమరులయ్యారు. ఈ ఘటనను దృష్టిలో ఉంచుకుని అత్యంత సాదా సీదాగా వందేభారత్ రైలు ప్రారంభ కార్యక్రమాన్ని నిర్వహించారు. రైలుకు ఎలాంటి అలంకరణ చేయలేదు.
హాల్ట్ సౌకర్యం రెండు చోట్లే..
`మేకిన్ ఇండియా`లో భాగంగా రైల్వే మంత్రిత్వశాఖ ఇంజిన్ లేని ఈ రైలును రూపొందించింది. న్యూఢిల్లీ నుంచి బయలుదేరే ఈ రైలు ఎనిమిది గంటల వ్యవధిలో ఉత్తర్ ప్రదేశ్ లోని వారణాశికి చేరుకుంటుంది. గంటకు 160 కిలోమీటర్ల వేగంతో ఈ రైలు రాకపోకలు సాగిస్తుంది. మధ్యలో రెండు చోట్ల మాత్రమే ఆగుతుంది. కాన్పూర్, ప్రయాగ్ రాజ్ స్టేషన్లలో మాత్రమే ఈ రైలుకు హాల్ట్ సౌకర్యాన్ని కల్పించారు.
ఛార్జీల వివరాలివీ..
గంటకు 160 కిలోమీటర్ల వేగంతో రాకపోకలు సాగించే ఓ రైలు రూపుదిద్దుకోవడం భారతయ రైల్వే వ్యవస్థలో ఇదే తొలిసారి. పూర్తి స్వదేశీ పరిజ్ఒానంతో దీన్ని తయారు చేశారు. ఇప్పటిదాకా దేశంలో అత్యంత వేగంతో ప్రయాణించే రైలుగా శతాబ్ది ఎక్స్ ప్రెస్ కు పేరుంది. 16 బోగీలు ఉండే ఈ రైలు ఛార్జీల ధర ఛెయిర్ కార్ లో 1760 రూపాయలు, ఎగ్జిక్యూటివ్ క్లాస్ లో 3,310 రూపాయలుగా నిర్ధారించారు. తిరుగు ప్రయాణ టికెట్ ను కూడా తీసుకుంటే.. ఛార్జీలు స్వల్పంగా తగ్గుతాయి. తిరుగు ప్రయాణంలో ఛెయిర్ కార్ ఛార్జీ 1700, ఎగ్జిక్యూటివ్ క్లాస్ ఛార్జీ 3,260 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది.