పుల్వామా దాడి: పాక్ హైకమిషనర్కు భారత్ సమన్లు, పాక్ విదేశాంగ శాఖ వివరణ తిరస్కరణ
న్యూఢిల్లీ: పాకిస్తాన్ హైకమిషనర్కు భారత్ శుక్రవారం సమన్లు జారీ చేసింది. పుల్వామా తీవ్రవాద దాడి జరిగిన వెంటనే భారత్ ఢిల్లీలోని పాక్ హైకమిషనర్కు సమన్లు జారీ చేసింది. జైష్ ఏ మొహమ్మద్ ఉగ్రవాద సంస్థపై చర్యలు తీసుకోవాలని పేర్కొంది. ఉగ్రవాద సంబంధాలు ఉన్న గ్రూప్లు, వ్యక్తులను నిలువరించాలని భారత్ కోరింది.
ఈ దాడిపై పాకిస్తాన్ విదేశాంగ శాఖ ఖండన, వివరణ ఇచ్చింది. దీనిని భారత్ తిరస్కరించింది. పాకిస్తాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ వివరణను భారత్ తోసిపుచ్చింది. అనంతరం పుల్వామా ఘటనపై ఢిల్లీలోని పాక్ హైకమిషనర్కు గట్టి నిరసన తెలిపింది.
పాకిస్తాన్ వెంటనే జైష్ ఎ మొహమ్మద్ పైన చర్యలు తీసుకోవాలని భారత్ డిమాండ్ చేసింది. తీవ్రవాద గ్రూపులను, వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని చెప్పింది. ఈ దాడులను ఖండిస్తూ పాకిస్తాన్ విదేశాంగ శాఖ ప్రకటనను భారత్ మొక్కుబడిగా పేర్కొంటూ తిరస్కరించింది. మరోవైపు రాజ్నాథ్ సింగ్ శ్రీనగర్ చేరుకున్నారు.
కాగా, ఈ ఘటనపై ప్రధాని నరేంద్ర మోడీ తీవ్రంగా స్పందించిన విషయం తెలిసిందే. ప్రపంచ దేశాలు ఇప్పటికే పాక్కు దూరమయ్యాయని, పాకిస్తాన్కు త్వరలోనే బుద్ధి చెబుతామన్నారు. ఉగ్రవాద సంస్థలకు తిరిగి లెక్క అప్పచెబుతామన్నారు. అమరులైన జవాన్ల కుటుంబాలకు ప్రధాని సంతాపం తెలిపారు. డిల్లీలోని వందేభారత్ ఎక్స్ప్రెస్ను జెండా ఊపి ప్రారంభించిన మోడీ... పుల్వామా ఘటనపై మాట్లాడారు. భారత్ను అస్థిరపరిచేందుకు ముష్కరులు చేస్తున్న ప్రయత్నాలు సాగవన్నారు.
పుల్వామా ఉగ్రదాడికి 130 కోట్ల భారతీయులు దీటైన జవాబిస్తారని మోడీ పేర్కొన్నారు. ఉగ్రదాడిని ఖండించిన దేశాలకు ప్రధాని కృతజ్ఞతలు తెలిపారు. ఈ ఉగ్రదాడి వెనుక ఉన్నవారు తప్పక శిక్ష అనుభవిస్తారన్నారు. భద్రతాబలగాలకు పూర్తి స్వేచ్ఛనిచ్చామన్నారు. వారి ధైర్యసాహసాలపై పూర్తి నమ్మకముందన్నారు. దేశ రక్షణ, దేశ అభివృద్ధి కోసం ప్రాణాలు అర్పించిన అమరుల సేవలను ప్రతి క్షణం గుర్తించుకుంటామన్నారు. వీర సైనికుల త్యాగాలను ఏ మాత్రం వృథాగా పోనివ్వమన్నారు.