ప్రతీకారం మొదలెట్టిన సైన్యం.. పుల్వామా దాడి "మాస్టర్ మైండ్" ఖేల్ ఖతం
పుల్వామా : పుల్వామా ఉగ్రదాడితో ప్రతీకారేచ్ఛకు సన్నద్ధమైంది సైన్యం. ముష్కరుల దొంగదెబ్బకు సరైన సమాధానం చెప్పేందుకు రెడీ అయింది. ఆ క్రమంలో జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థకు చెందిన ఇద్దర్ని మట్టుబెట్టింది. పుల్వామా ఉగ్రదాడిలో మాస్టర్ మైండ్ అయిన రషీద్ ఘాజీతో పాటు మరో టెర్రరిస్టు కమ్రాన్ ను కాల్చి చంపింది సైన్యం. సోమవారం నాడు తెల్లవారుజామున పుల్వామా జిల్లాలోని పింగ్లాన్ ఏరియాలో జరిగిన ఎదురుకాల్పుల్లో టెర్రరిస్టుల అంతం చూసింది. ఈ ఘటనలో మేజర్ తో పాటు మరో ముగ్గురు జవాన్లు నెలకొరిగారు.
ఎవడీ ఘాజీ?
పుల్వామా ఉగ్రదాడిలో 40 మందికి పైగా జవాన్లను పొట్టన పెట్టుకుంది జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థ. ఈ దాడికి మాస్టర్ మైండ్ గా ఆ సంస్థ కమాండర్ అబ్దుల్ రషీద్ ఘాజీపై సైన్యం అనుమానాలు వ్యక్తం చేసింది. ఆత్మాహుతి దాడికి దిగిన అదిల్ కు ఘాజీయే శిక్షణ ఇచ్చాడనే ప్రచారం జరుగుతోంది. అంతేకాదు ఆ సంస్థ చీఫ్ మౌలానా మసూద్ అజర్ కు ఘాజీ ప్రధాన అనుచరుడిగా ముద్రపడ్డాడు. అయితే ఐఈడీ బాంబులు ఉపయోగించడంలో విశేష అనుభవమున్న ఘాజీ.. మొన్నటి పుల్వామా దాడి ఘటనలో అదిల్ కు శిక్షణ ఇచ్చాడు.
గత రెండేళ్లల్లో టెర్రరిస్టులకు, సైన్యానికి మధ్య జరిగిన దాడుల్లో మసూద్ అజర్ మేనళ్లుల్లను జవాన్లు అంతమొందించారు. దీంతో ప్రతీకారేచ్ఛతో రగిలిపోతున్న మసూద్.. ఘాజీని కశ్మీర్ కు పంపించాడు. ఆ నేపథ్యంలోనే అదిల్ కు శిక్షణ ఇచ్చాడు ఘాజీ. పుల్వామా ఉగ్రదాడి అనంతరం అక్కడికి సమీపంలోని ఇళ్లల్లో ఘాజీ దాక్కున్నాడు. ఆ క్రమంలో ఉగ్రవాదులు ఓ ఇంట్లో ఉన్న సమాచారం మేరకు.. సోమవారం తెల్లవారుజామున భద్రతాదళాలు చుట్టుముట్టాయి. ఎదురుకాల్పులు జరగడంతో ఆర్మీ మేజర్ సహా నలుగురు సైనికులు చనిపోయారు. అనంతరం కొనసాగిన కాల్పుల్లో ఘాజీతో పాటు కమ్రాన్ ను అంతమొందించింది సైన్యం. గతంలో పలుమార్లు జవాన్ల దాడి నుంచి ఘాజీ తప్పించుకున్నాడు.
పుల్వామా అటాక్: అందుకు ప్రతీకారంగా... పాకిస్తాన్ ఆర్మీ ఆసుపత్రి నుంచి అజహర్ ఆదేశాలు
కశ్మీర్ లో పట్టు
2008లో జైషే మహమ్మద్ సంస్థతో జతకట్టిన ఘాజీ.. ఆ సంస్థ చీఫ్ మౌలానా మసూద్ అజర్ కు సన్నిహితుడిగా మారేంతలా ఎదిగాడు. ఆఫ్ఘనిస్తాన్ లో తాలిబన్ల దగ్గర దాదాపు రెండేళ్ల పాటు శిక్షణ పొందాడు. అనంతరం 2010లో వజరిస్తాన్ లో అడ్డా వేసి.. ఆ సంస్థ కోసం కశ్మీర్ యువకులను రిక్రూట్ చేసేవాడు. అలా నియమించుకున్నవారిలో అదిల్ కూడా ఒకడు. కొత్తగా చేరినవారికి శిక్షణ ఇస్తూనే.. కశ్మీర్ పై పూర్తి పట్టు సాధించాడు. అలా మొన్నటి పుల్వామా ఉగ్రదాడిలో 40 మందికి పైగా జవాన్లను పొట్టనపెట్టుకున్నాడు.
ఆ రోజే హతమై ఉంటే..!
జైషే సంస్థ కశ్మీర్ లో రెచ్చిపోవడానికి ప్రధాన కారణం ఘాజీయే అనే విషయం స్పష్టమవుతోంది. ఘాజీ కార్యకలాపాలు విస్తరించడంతో జైషే సంస్థ కొంత పట్టు సాధించినట్లైంది. రూరల్ లెవెల్లో నియమకాలు చేపట్టిన ఘాజీ.. ఆ మేరకు ఎప్పటికప్పుడు పక్కా వ్యూహాలు రచించేవాడట. యువకులను చేర్చుకునే క్రమంలో పెద్దమొత్తంలో నగదు ఇవ్వడం.. మాట వినకుంటే బెదిరించడం లాంటి చర్యలతో క్రమంగా జైషే సంస్థను బలంగా మార్చాడు. ఘాజీ కదలికలను పసిగట్టిన సైన్యం పలుమార్లు నిలువరించే ప్రయత్నం చేశాయి. కానీ చాలాసార్లు తప్పించుకున్నాడు. ఆ క్రమంలో కొద్దిరోజుల కిందట కూడా జరిగిన ఎదురుకాల్పుల్లో సైన్యానికి తారసపడి తృటిలో తప్పించుకున్నాడు. అప్పుడే ఘాజీ అంతమొంది ఉంటే.. భారత సైన్యం 40 మందికి పైగా జవాన్లను కోల్పోయి ఉండేది కాదు.