బెంగళూరులో పోలీసు అధికారి కుమారుడి దాడి: డ్యూటీలో ఉన్న హెడ్ కానిస్టేబుల్ మృతి !
బెంగళూరులో విధుల్లో ఉన్న హెడ్ కానిస్టేబుల్ మీద దాడిపోలీసు అధికారి కుమారుడి నిర్వాకం, కారు నిలిపినందుకు రెచ్చిపోయాడుకుప్పకూలి మరణించిన హెడ్ కానిస్టేబుల్, కేసు నమోదు చేసిన పోలీసులు
బెంగళూరు: విధులలో ఉన్న హెడ్ కానిస్టేబుల్ మీద పోలీసు అధికారి కుమారుడు దాడి చెయ్యడంతో తీవ్రగాయాలై మరణించిన ఘటన బెంగళూరు నగరంలోని పరప్పన అగ్రహార పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. కేఎస్ఆర్ పీ (రిజర్వ్) లో హెడ్ కానిస్టేబుల్ గా ఉద్యోగం చేస్తున్న అప్పాజీ(49) మరణించారు.
పరప్పన అగ్రహార పోలీస్ స్టేషన్ పరిధిలోని కూడ్లులోని కేఎస్ఆర్ పీ 9వ బెటాలియన్ లో అప్పాజీ ఉద్యోగం చేస్తున్నారు. కూడ్లులోని కేఎస్ఆర్ పీ క్వాటర్స్ లో కుటుంబ సభ్యులతో కలిసి ఆయన నివాసం ఉంటున్నారు. శనివారం రాత్రి కేఎస్ఆర్ పీ క్వాటర్స్ గేట్ దగ్గర అప్పాజీ విధుల్లో ఉన్నారు.
ఇదే క్వాటర్స్ లో ఏఆర్ ఎస్ఐ యర్రిస్వామి కుటుంబ సభ్యులతో కలిసి నివాసం ఉంటున్నారు. శనివారం రాత్రి యర్రిస్వామి ఇంటికి బంధువులు కారులో వెళ్లారు. క్వాటర్స్ గేట్ దగ్గర కారు నిలపకుండా వేగంగా లోపలికి వెళ్లిపోయారు. ఆ సమయంలో కారు నిలపాలని అప్పాజీ సూచించినా వారు పట్టించుకోలేదు.
తిరిగి కారు బయటకు వస్తున్న సమయంలో అప్పాజీ వాహనం నిలిపారు. లోపలికి ప్రవేశించే సమయంలో కారు ఎందుకు నిలపలేదని అప్పాజీ వారిని ప్రశ్నించాడు. ఆ సందర్బంలో ఏఆర్ఎస్ఐ యర్రిస్వామి భార్య, కుమారుడు రూపేష్ అక్కడికి వచ్చి అప్పాజీతో గొడవ పెట్టుకున్నారు.
సహనం కోల్పోయిన రూపేష్ బలంగా అప్పాజీ మీద దాడి చేశాడు. తీవ్రగాయాలైన అప్పాజీ విక్టోరియా ఆసుపత్రిలో చికిత్స చేసుకుని ఆదివారం పై అధికారులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఏఆర్ఎస్ఐ యర్రిస్వామి భార్య, కుమారుడు రూపేష్, మరో వ్యక్తి మీద కేసు నమోదు చేశారు.
ఇంటికి వెళ్లిన అప్పాజీ ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. వెంటనే ఆయన్ను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. చికిత్స విఫలమై అప్పాజీ సోమవారం మరణించాడని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసిన పోలీసులు అప్పాజీ మరణానికి కారణం అయిన వారిని అరెస్టు చేసి విచారణ చెయ్యడానికి సిద్దం అయ్యారు.