బుల్లెట్ తాళి: గంటలో 4 కిలోల ఫుడ్.. టార్గెట్ రీచయితే ఎన్ఫీల్డ్ బైక్
భోజన ప్రియులను ఆకట్టుకునేందుకు రెస్టారెంట్లు ఆఫర్లు ప్రకటిస్తాయి. బఫెట్ కోసం ఆఫర్లు ఇస్తాయి. ఒక్కో రేటులో అందిస్తాయి. అయితే పుణెకు చెందిన ఓ రెస్టారెంట్ మాత్రం బంపర్ ఆఫర్ ప్రకటించింది. తమ హోటల్కి వచ్చిన వారికి 4 కిలోల ఫుడ్ అందజేస్తోంది. అయితే రకరకాల ఫుడ్స్ పెద్ద ప్లేట్లో వడ్డిస్తోంది. ఇక తినడమే తరవాయి.. కానీ గంటలో పూర్తిచేయాలని షరతు విధించింది.
ఎన్ఫీల్డ్ బైక్..
వాడగొన్ మావల్ పరిధిలో శివరాజ్ హోటల్ ఉంది. తమ హోటల్కి వచ్చే కస్టమర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. కరోనా వల్ల హోటల్ రంగం చతికిలబడిన సంగతి తెలిసిందే. జనం వచ్చేందుకు జంకుతున్నారు. దీంతో వారికి ఒక ఆఫర్ ప్రకటించింది. నాన్ వెజ్ తాళి గంటలో పూర్తి చేయాలని షరతు విధించింది. ఒకవేళ గంటలో పూర్తిచేస్తే 1.65 లక్షల రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ గిప్టుగా అందజేస్తామని తెలిపింది.
12 రకాల డిష్..
నాన్ వెజ్ తాళిలో 12 రకాల వంటకాలు ఉంటాయి. మటన్, ఫిష్, ఫ్రైడ్ సుర్మయ్, ఫొమ్ఫ్రెట్ ఫ్రైడ్ రైస్, చికెన్ తందూరి, డ్రై మటన్, గ్రే మటన్, చికెన్ మసాలా, ప్రాన్ బిర్యానీ ఉంటాయి. రూ.2500 పెట్టి కొనుగోలు చేయాలి. దానిని కంప్లీట్ చేస్తే బైక్.. లేదంటే రూ.2500 చెల్లించి బయటకు రావాల్సి ఉంటుంది. రెస్టారెంట్ అందజేసే తాళి గురించి ప్రజలకు అవగాహన కల్పించేందుకు బ్యానర్లు కడుతున్నారు. హోటల్ వరండాలో ఐదు రాయల్ ఎన్ ఫీల్డ్ వెహికిల్స్ కూడా పెట్టారు. బుల్లెట్ తాళికి ప్రజల నుంచి మంచి స్పందన వస్తుందని హోటల్ ఓనర్ అతుల్ వాయికర్ తెలిపారు. ఇప్పటికే కొందరు కాంటెస్ట్లో పాల్గొన్నారని వెల్లడించారు.
బుల్లెట్ తాళి..
బుల్లెట్ తాళిని ఒకరు గెలుచుకున్నారు. గంటలోపు ఆరగించేశారు. షోలాపూర్కి చెందిన సోమ్ నాథ్ పవార్ ఫినిష్ చేసి.. ఎన్ ఫీల్డ్ తీసుకెళ్లారు. ఇప్పుడే కాదు ఇదివరకు కూడా శివరాజ్ హోటల్ ఇలాంటి ఆఫర్లు ప్రకటించింది. గతంలో నలుగురు కలిసి 8 కిలోల రావవణ్ తాళి కంప్లీట్ చేయాలని పోటీ పెట్టారు. గంటలో పూర్తి చేయాలని స్పష్టంచేశారు.