‘ఎవరెస్ట్’ అంత మోసం: ఆ పోలీసు దంపతుల డిస్మిస్
ఎవరెస్ట్ శిఖరం అధిరోహించామని అబద్ధం చెప్పి నమ్మించిన పుణెలో పోలీసు కానిస్టేబుళ్లుగా విధులు నిర్వహిస్తోన్న భార్యభర్తలు డిస్మిస్ అయ్యారు.
పుణె: ప్రపంచంలోనే ఎత్తైన ఎవరెస్ట్ శిఖరం అధిరోహించామని అబద్ధం చెప్పి నమ్మించిన మహారాష్ట్రలోని పుణెలో పోలీసు కానిస్టేబుళ్లుగా విధులు నిర్వహిస్తోన్న భార్యభర్తలు దినేశ్ రాథోడ్, తారకేశ్వరి రాథోడ్ దంపతులపై శాశ్వత వేటు పడింది. ఎవరెస్ట్ ఎక్కిన తొలి భారతీయ దంపతులు తామేనని ప్రకటించుకుని గతంలో సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే.
2016 మేలో తాము ఎవరెస్టు ఎక్కినట్లు పేర్కొంటూ అందుకు సంబంధించిన ఫొటోలను వారు సోషల్మీడియాలో పోస్ట్ చేశారు. అయితే ఈ దంపతులు ఎవరెస్టు శిఖరాన్ని ఎక్కలేదని పలువురి నుంచి ఫిర్యాదులు వచ్చాయి. ప్రాథమిక విచారణలో దినేశ్ దంపతులు.. ఇతరుల ఫొటోలను మార్ఫింగ్ చేసి తాము శిఖరాన్ని అధిరోహించినట్లు ప్రకటించుకున్నట్లు తేలింది. దీంతో పుణె పోలీసు శాఖ వారిపై 2016 నవంబరులో సస్పెన్షన్ విధించింది.
ఈ ఘటనపై పుణె పోలీసులు నేపాల్ ప్రభుత్వానికి సమాచారం అందించారు. కాగా, 10ఏళ్ల పాటు దినేశ్ దంపతులకు తమ దేశంలో అడుగుపెట్టేందుకు అనుమతి నిరాకరిస్తున్నట్లు గత ఆగస్టులో నేపాల్ ప్రభుత్వం ప్రకటించడం గమనార్హం.
తాజాగా దినేశ్ దంపతులను విధుల నుంచి పూర్తిగా తొలగిస్తున్నట్లు అడిషనల్ కమిషనర్ ఆఫ్ పోలీస్ సహిబ్రాయో పాటిల్ వెల్లడించారు. ప్రత్యేక ప్యానెల్ ఏర్పాటు చేసి విచారణ జరిపించగా దినేశ్ దంపతులు మోసం చేసినట్లు తేలింది. దీంతో వారిని విధుల నుంచి తొలగిస్తున్నట్లు ఆయన తెలిపారు.