కోరిక తీరిస్తేనే పీహెచ్డీ పట్టా: విద్యార్థినితో ప్రొఫెసర్, ఆమె ఏం చేసిందంటే?
ఓ కీచక ప్రొఫెసర్ బాగోతం బట్టబయలైంది.ఉన్నత చదువుల కోసం ఇరాన్ దేశం నుంచి వచ్చిన 31ఏళ్ల మహిళను తన కోరిక తీరిస్తేనే పీహెచ్డీ సీటు ఇస్తానని తేల్చి చెప్పాడు. దీంతో బాధిత మహిళ పోలీసులను ఆశ్రయించింది.
పుణె: ఓ కీచక ప్రొఫెసర్ కటకటాలపాలయ్యాడు. ఉన్నత చదువుల కోసం ఇరాన్ దేశం నుంచి వచ్చిన 31ఏళ్ల మహిళను తన కోరిక తీరిస్తేనే పీహెచ్డీ సీటు ఇస్తానని తేల్చి చెప్పాడు. దీంతో బాధిత మహిళ పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సదరు కీచక ప్రొఫెసర్ను అరెస్ట్ చేశారు. ఈ ఘటన మహారాష్ట్రంలోని పుణెలో చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళితే.. ఇరాన్ దేశానికి చెందిన 31 ఏళ్ల మహిళ పీజీ పూర్తి చేసుకొని అకౌంట్స్లో పీహెచ్డీ చేసేందుకు పుణె నగరానికి చెందిన యశ్వంతరావు మొహితే కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ సైన్సు అండ్ కామర్స్ కళాశాలకు వచ్చింది. ఆగస్టు 8వతేదీన ఇరాన్ మహిళ తనకు పీహెచ్డీ సీటు ఇవ్వాలని ప్రొఫెసర్ శివాజీ బొర్హాడే (53) ని కోరింది.
కాగా, తనతో లైంగిక సంబంధం పెట్టుకొని తన కోరిక తీరిస్తే పీహెచ్డీ సీటు ఇస్తానని ప్రొఫెసర్ చెప్పడంతో ఆ ఇరాన్ మహిళ ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురైంది. వెంటనే ప్రొఫెసర్ గదిలోనుంచి బయటకు వచ్చి తన గదిలోకి వెళ్లిన ఇరాన్ మహిళ.. స్వదేశంలో ఉన్న తల్లిదండ్రులతో మాట్లాడి తన కోరిక తీర్చమన్న ప్రొఫెసరుపై పుణె పోలీసులకు ఫిర్యాదు చేసింది.
దీంతో కుత్రుడ్ పోలీసులు ప్రొఫెసరు శివాజీ బొర్హాడేపై ఐపీసీ సెక్షన్ 354 (ఎ) కింద కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. పోలీసుల ప్రాథమిక విచారణలో నిందితుడైన శివాజీ బొర్హాడే తన నేరాన్ని అంగీకరించి క్షమాపణలు చెప్పాడు. కళాశాలలో సీనియర్ ప్రొఫెసర్ అయిన శివాజీ బొర్హాడే ఇద్దరు అమ్మాయిలకు తండ్రి అయి ఇలా వ్యవహరించడంపై విమర్శలు వెల్లువెత్తాయి. ప్రొఫెసర్ తీరుపై పలువురు విద్యార్థులు నిరసన ప్రదర్శనలు చేపట్టారు. సదరు ప్రొఫెసర్పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.