రక్తపు మడుగులో టెక్కీ: సెల్ఫీలు, వీడియోలతో ప్రాణం తీసిన జనం
ఇటీవల కాలంలో జరుగుతున్న పలు ఘటనలు చూస్తుంటే మనుషుల్లో మానవత్వం కనుమరుగవుతున్నట్లు కనిపిస్తోంది. తాజాగా, ఓ సాఫ్ట్వేర్ ఇంజినీర్ రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు.
పుణె: ఇటీవల కాలంలో జరుగుతున్న పలు ఘటనలు చూస్తుంటే మనుషుల్లో మానవత్వం కనుమరుగవుతున్నట్లు కనిపిస్తోంది. తాజాగా, ఓ సాఫ్ట్వేర్ ఇంజినీర్ రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. రక్తపు మడుగులు అతడు సాయం కోసం కొట్టుమిట్టాడుతుంటే.. అక్కడికొచ్చిన వారు అతడ్ని ఆస్పత్రికి తరలించకపోగా తమ ఫోన్లలో ఫొటోలు, వీడియోలు తీసుకుంటూ ఉండటం విచారకరం. సమయానికి ఆస్పత్రిలో చేర్చకపోవడంతో ఆ టెక్కీ ప్రాణాలు విడిచాడు. ఈ ఘటన మహారాష్ట్రలోని పుణెలో చోటు చేసుకుంది.
ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.. ఔరంగాబాద్కు చెందిన సతీష్ ప్రభాకర్ మేటె స్థానిక బోసారిలోని ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. ఏదో పని మీద బుధవారం సాయంత్రం సతీష్ రోడ్డుపైకి వచ్చాడు. బోసారిలో రోడ్డుపై వెళ్తుండగా ఓ గుర్తు తెలియని వాహనం టెక్కీని ఢీకొట్టింది. కాగా, అతడికి ఏమైందో కూడా చూడకుండా ఆ వాహనదారుడు అక్కడ్నుంచి వెళ్లిపోయాడు.
కొద్ది క్షణాల్లో అక్కడికి పదుల సంఖ్యలో జనాలు సతీష్ చుట్టూ గుమిగూడారు. తీవ్రంగా రక్తస్రావమవుతున్న అతడ్ని కాపాడాల్సిందిపోయి.. కొందరు వీడియోలు, ఫొటోలు తీసుకున్నారు. మరికొందరైతే రక్తపుమడుగులో ఉన్న అతడితో సెల్పీలు దిగడం శోచనీయం. ఇంతలో అక్కడికి వచ్చిన కార్తీరాజ్ కాటే అనే డెంటిస్ట్ కొంతమంది సాయంతో సతీష్ను హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు.
సతీష్ను పరీక్షించిన యశ్వంత్ రావు చౌహాన్ ఆస్పత్రి వైద్యులు.. అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. దీంతో సతీష్ ను ఆస్పత్రికి తీసుకెళ్లిన డెంటిస్ట్ కార్తీరాజ్ ఆవేదనకు గురయ్యారు. రక్తపు మడుగులో కొట్టుమిట్టాడుతున్న వ్యక్తిని ఆస్పత్రికి తీసుకెళ్లకుండా ఫొటోలు, వీడియోలు తీస్తూ అక్కడి జనం కాలం వెళ్లదీశారని, ప్రమాదం జరిగిన వెంటనే అతడ్ని ఆస్పత్రికి తీసుకొచ్చివుంటే అతడు బతికేవాడని ఆయన వాపోయారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.