ప్రపంచ ఎయిడ్స్ డే రోజునే దారుణం...భార్యకు ఎయిడ్స్ ఇంజక్షన్ ఇచ్చిన భర్త
మహారాష్ట్ర : ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం రోజున ఓ మహిళకు తన భర్త హెచ్ఐవీ ఇంజెక్షన్ ఇచ్చి దారుణానికి పాల్పడ్డాడు. మహిళ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ ఘటన వెలుగు చూసింది. వివరాల్లోకి వెళితే... మహారాష్ట్రలోని పింప్రి చించ్వాడ్లోని పింపుల్ సౌదాగర్ ప్రాంతంలో నివాసముంటున్న మహిళ తన భర్త హెచ్ఐవీ ఇంజెక్షన్ ఇచ్చాడంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. విడాకులు ఇవ్వాల్సిందిగా పలు మార్లు వేధించాడని... అయితే తన విడాకులు ఇచ్చేందుకు నిరాకరించడంతో ఈ దారుణానికి పాల్పడ్డాడని మహిళ పోలీసులకు తెలిపింది. ఆమె భర్త ఒక డాక్టరు అని కూడా ఫిర్యాదులో పేర్కొంది. తనను కొద్దిరోజులుగా భర్త అత్తమామలు వేధిస్తున్నారని ఫిర్యాదు చేసింది.
2015లో మహిళకు వివాహమైంది. ఆమె గృహిణిగా ఉండగా అదే ప్రాంతంలో ఉన్న గ్లోబల్ హాస్పిటల్లో భర్త హోమియోపతి డాక్టర్గా పనిచేస్తున్నాడు. ఈ ఏడాది జనవరిలో ఆరోగ్యపరంగా కొన్ని సమస్యలు తలెత్తడంతో పరీక్షలు చేయించుకోగా తనకు హెచ్ఐవీ సోకినట్లు పరీక్షల్లో వెల్లడైందని మహిళ పేర్కొంది. గతేడాది అక్టోబర్లో తనకు ఆరోగ్యం సరిగ్గా లేకపోవడంతో తన భర్త సెలైన్ బాటిల్ పెట్టారని అందులోనే హెచ్ఐవీ ఇంజెక్షన్ చేసినట్లు మహిళ పేర్కొంది. ఆమె రక్త పరీక్ష రిపోర్టులు మరోసారి ఇవ్వాల్సిందిగా పోలీసులు వైద్యులను కోరినట్లు తెలిపారు.
అంతేకాదు ఈ రిపోర్టులు వస్తే ఇన్ఫెక్షన్ ఎప్పటి నుంచి ఉందో తెలుస్తుందన్నారు. శరీరంలోకి ఎలా ఇంజెక్ట్ అయ్యిందో కూడా బయటపడుతుందన్నారు. అది లైంగికంగా వైరస్ శరీరంలోకి ప్రవేశించిందా లేక బలవంతంగా శరీరంలోకి ప్రవేశపెట్టారా అన్న అంశంపై క్లారిటీ వస్తుందన్నారు. వైద్యుల నుంచి స్పష్టమైన ఆధారాలు వచ్చేవరకు భర్తను అరెస్టు చేయలేమని పోలీసులు తెలిపారు. ప్రస్తుతం కొన్ని డాక్యుమెంట్లు తీసుకుని పోలీస్ స్టేషన్కు రావాల్సిందిగా మహిళ భర్తకు నోటీసులు పంపామని చెప్పారు.
అదనపు కట్నం కోసం అత్తమామలు వేధిస్తున్నారని మహిళ ఆరోపించినట్లు పోలీసులు వెల్లడించారు. ఇక రోజు రోజుకీ వారి నుంచి వేధింపులు ఎక్కువవుతుండటం... వారి డిమాండ్లకు ఒప్పుకోకపోవడంతో ఆమెపై దాడి చేస్తూ చిత్రహింసలు పెడుతున్నారని మహిళ ఫిర్యాదు చేసింది. ఇక లాభం లేదనుకుని విడాకుల పేపర్లపై సంతకాలు చేయించే యోచనతో ఆమె అనారోగ్యంతో ఉన్నప్పుడు వైరస్ తన శరీరంలోకి ఇంజెక్ట్ చేసినట్లు మహిళ ఫిర్యాదులో పేర్కొన్నట్లు పోలీసులు తెలిపారు.