ఉద్యోగి అయిన భర్తను చంపినా, వేరే పెళ్లి చేసుకున్నా.. ఆమెకు పింఛను దక్కాల్సిందే: కోర్టు సంచలనం
ఛండీగఢ్: పంజాబ్-హర్యానా హైకోర్టు సంచలన తీర్పును వెలువరించింది. ప్రభుత్వ ఉద్యోగి భార్యకున్న కుటుంబ పింఛను హక్కు కాదనలేనిదని, ఒకవేళ ఆమె తన భర్తను చంపినా.. భర్త మరణాంతరం పునర్వివాహం చేసుకున్నా సరే.. పింఛను పొందవచ్చని అసాధారణ తీర్పును ఇచ్చింది.
అంతేగాక, బంగారు గుడ్లు పెట్టే కోడిని ఎవరూ కిరాతకంగా చంపుకోరూ అంటూ వ్యాఖ్యానించింది హైకోర్టు. హర్యానాలోని అంబాలాకు చెందిన బల్జీత్ కౌర్ అనే మహిళ దాఖలు చేసిన పిటిషన్ విచారణ సందర్భంగా జనవరి 25న హైకోర్టు ఈ మేరకు వ్యాఖ్యానించింది.
వివరాల్లోకి వెళితే.. హర్యానా ప్రభుత్వ ఉద్యోగి అయిన బల్జీత్ కౌర్ భర్త తర్సెమ్ సింగ్ 2008లో చనిపోయారు. 2009లో ఆమెపై హత్యానేరం కింద కేసు నమోదు చేశారు. 2011లో శిక్ష పడింది. అప్పటిదాకా బల్జీత్ కౌర్కు అందుతున్న కుటుంబ పింఛన్ ను శిక్ష పడగానే హర్యానా ప్రభుత్వం నిలిపివేసింది. దీంతో ఆమె హైకోర్టును ఆశ్రయించింది.
ప్రభుత్వ ఉత్తర్వులను పక్కనపెడుతూ హర్యానా ప్రభుత్వం రావాల్సిన కుటుంబ పింఛను, పాత బకాయిలు రెండు నెలల్లో విడుదల చేయాల్సిందిగా కోర్టు సంబంధిత శాఖను ఆదేశించింది. భర్త మరణాంతరం కుటుంబ పింఛను హక్కు దారు భార్యేనంటూ 1972 సీసీఎస్(పింఛను) నిబంధనల మేరకు హైకోర్టు తీర్పుు వెలురించింది.
కుటుంబ పింఛను అనేది సంక్షేమ పథకం. ప్రభుత్వ ఉద్యోగి చనిపోయినప్పుడు ఆ కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకునేందుకు దాన్ని ప్రవేశపెట్టారు. క్రిమినల్ కేసులో ఆమెకు జైలు శిక్ష పడ్డా ఈ పథకం కింద భార్యకున్న హక్కును కాదనలేం అని తీర్పు సందర్భంగా హైకోర్టు వ్యాఖ్యానించింది.