పంజాబ్ పోరు: బాదల్ వర్సెస్ కెప్టెన్
కాంగ్రెసులోకి సిద్ధూ ఎంట్రీ ఇచ్చినప్పటికీ పంజాబ్లో పోరు ప్రకాశ్ సింగ్ బాదల్, మాజీ సిఎం అమరీందర్ సింగ్ మధ్యనే జరగనుంది.
చండీగఢ్: పంజాబ్ సిఎం ప్రకాశ్ సింగ్ బాదల్ (89), మాజీ సిఎం కెప్టెన్ అమరీందర్ సింగ్ మధ్య ముఖాముఖీ పోటీ ఆమ్ ఆద్మీ పార్టీకి లబ్ది చేకూర్చనున్నది. సిఎం బాదల్ ప్రాతినిధ్యం వహిస్తున్న శిరోమణి అకాలీదళ్ (ఎస్ఎడి) పార్టీకి బలమైన స్థానంగా నుంచి పోటీకి కెప్టెన్ అమరీందర్ సింగ్ పోటీకి సిద్ధమైన నేపథ్యంలో ఇదే నిజమని తెలుస్తున్నది. ఇరువురు ప్రముఖుల మధ్య పోటీ జరిగితే అరవింద్ కేజ్రీవాల్ సారథ్యంలోని ఆప్ లబ్ది చేకూరుతుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. నెల రోజులుగా పంజాబ్ రాష్ట్రంలో తిష్టవేసి చిన్న చిన్న ర్యాలీల్లో పాల్గొంటూ పంజాబీలను తమ వైపునకు తిప్పుకునేందుకు యత్నిస్తున్నారు.
ప్రకాశ్ సింగ్ బాదల్ కుమారుడు, డిప్యూటీ సిఎం సుఖ్బీర్ బాదల్ రాష్ట్రవ్యాప్త ప్రచారంచేస్తుండగా, ప్రకాశ్ సింగ్ బాదల్ గ్రామాల్లో ప్రజలతో 'సంగత్ దర్శన్స్' చర్చాగోష్టులు నిర్వహిస్తూ గడుపుతున్నారు. ఎన్నికల వేళ ఆమ్ఆద్మీ పార్టీ (ఆప్) ప్రచార వ్యూహం బయటపడకుండా సాగుతున్నది. ప్రస్తుత త్రిముఖ పోటీ నేపథ్యంలో అకాలీదళ్ పార్టీ నాయకత్వం తన వ్యూహాన్ని చాలా జాగ్రత్తగా తీర్చిదిద్దుకుని ముందుకు సాగుతున్నది. 1947లో లంబ్రీ గ్రామ సర్పంచ్గా రాజకీయ జీవితం ప్రారంభించిన బాదల్.. తర్వాత లంబ్రీ బ్లాక్ సమితి చైర్మన్గా ఎన్నికయ్యారు.
1957లో తొలిసారి పంజాబ్ అసెంబ్లీకి ఎన్నికైన బాదల్ తిరిగి 1969లో రెండోసారి విజయం సాధించారు. 1972లో విపక్ష నేతగా తొలిసారి బాధ్యతలు నిర్వర్తించిన బాదల్.. 1980, 2002లలో అదే పాత్ర పోషించారు. పదిసార్లు అసెంబ్లీకి ఎన్నికైన బాదల్ ఐదుసార్లు సిఎంగా సేవలందించారు. తొలిసారి 1970లో పంజాబ్ సిఎంగా బాధ్యతలు స్వీకరించే నాటికి దేశంలోకెల్లా అత్యంత పిన్న వయస్కుడు.
సిఎం ప్రకాశ్ సింగ్ బాదల్ కంటే 14 ఏళ్లు చిన్న వాడైన కెప్టెన్ అమరీందర్ సింగ్ అకాలీదళ్ పార్టీకి ప్రత్యర్థిగా ఉన్నారు. 2014 లోక్సభ ఎన్నికల్లో అమ్రుత్సర్ స్థానం నుంచి ప్రస్తుత కేంద్ర ఆర్థికశాఖ మంత్రి అరుణ్ జైట్లీపై కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా లక్ష ఓట్లకు పైగా మెజారిటీతో విజయం సాధించారు. దేశమంతా కమలనాథుల ప్రభంజనం సాగుతున్న తరుణంలో అమ్రుత్సర్ స్థానం నుంచి పోటీకి నిరాకరించిన కెప్టెన్ అమరీందర్ సింగ్ను కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ఒప్పించి బరిలోకి దించింది. అప్పటి నుంచి మళ్లీ అమరీందర్ సింగ్ వెలుగులోకి వచ్చారు.
రాంపూర్ ఫులాలోని మెహరాజ్లో జరిగిన సభలో మాట్లాడిన అమరీందర్ సింగ్.. సీఎం బాదల్ కుటుంబ సభ్యులపై నిప్పులు చెరిగారు. దైవ ద్రోహానికి పాల్పడుతూ డ్రగ్ మఫియాను ప్రోత్సహిస్తున్న నిందితులందరిని ఉరి తీయాలని వ్యాఖ్యానించారు. ఆమ్ఆద్మీ పార్టీ నేత అరవింద్ కేజ్రీవాల్ ఒక పిరికిపంద అని వ్యాఖ్యానించారు. అటువంటి వారిని పంజాబీలు సహించబోరని వ్యాఖ్యానించారు. పంజాబీలు తమ కీర్తి ప్రతిష్టల పరిరక్షణకు వెనుకాడబోరన్నారు. అంతకుముందు అమరీందర్ సింగ్ మెహ్రాజ్ గురుద్వారాలోని ఆరవ గురు బాద్షా వద్ద ఆశీస్సులు పొందారు.
కెప్టెన్ అమరీందర్ సింగ్, ఢిల్లీ మాజీ సిఎం అరవింద్ కేజ్రీవాల్లపై బాదల్ కూడా తనదైన శైలిలో నిప్పులు చెరిగారు. 'పాటియాలా వాలా (అమరీందర్ సింగ్), ఢిల్లీ వాలా (ఆప్ మాజీ ఎమ్మెల్యే జర్నాల్ సింగ్) లాంబ్రీ నుంచి పోటీకి సిద్ధమయ్యారు. లాంబ్రీని పట్టించుకునే వారే లేరని వీరు భావిస్తున్నారా?' అని ప్రశ్నించారు. బయటి వ్యక్తులు వచ్చి తమ స్వస్థానంలో పోటీ చేయడమేమిటంటూ నిలదీశారు. ప్రతి ఎన్నికల ప్రచారసభలోనూ గత లోక్ సభ ఎన్నికల్లో తన కోడలు హర్ సిమ్రత్ కౌర్ బాదల్ చేతిలో బాటిండా స్థానం నుంచి 1.5 లక్షల తేడాతో ఓటమి పాలైన అమరీందర్ సింగ్ తనయుడు రనిందర్ సింగ్ గురించి గుర్తుచేశారు.