వారికి షాక్: పంజాబ్లో కాంగ్రెస్దె గెలుపు, సిద్ధు కీ రోల్
చండీగఢ్: పంజాబ్లో కాంగ్రెస్ జెండా ఎగరనుందా? అకాళీదళ్ - బీజేపీ కూటమికి ఓటమి తప్పదా? అరవింద్ కేజ్రీవాల్ పార్టీ రెండో స్థానం సరిపెట్టుకోవాల్సిందేనా? అంటే అవుననే అంటున్నాయి ఒపీనియన్ పోల్స్. త్వరలో పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.
ఈ నేపథ్యంలో ఇండియా టుడే - యాక్సిస్ ఒపీనియన్ పోల్ నిర్వహించింది. ఈ సర్వేలో కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశాలున్నాయని తేలింది. అతిపెద్ద పార్టీగా కాంగ్రెస్ అవతరించనుంది. రెండో స్థానం ఏఏపీకీ రానుంది. అధికారంలో ఉన్న బీజేపీ - అకాళీదళ్కు చుక్కెదురవుతుందని తేలింది.
సర్వే ప్రకారం.. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి 49 నుంచి 55 సీట్లు వచ్చే అవకాశముంది. ఆమ్ ఆద్మీకి 42 నుంచి 46 సీట్లు గెలుచుకోవచ్చు. కాంగ్రెస్కు మూడొంతుల (33శాతం) ఓట్లు పడతాయని, ఏఏపీకి 30శాతం ఓట్లు పడే అవకాశముందని సర్వేలో పేర్కొన్నారు. పంజాబ్లో గెలుస్తామని ఏఏపీ ఆశలు పెట్టుకుంది.
అధికారంలో ఉన్న శిరోమణి అకాళీదళ్-బీజేపీ కూటమికి 17 నుంచి 21 సీట్లు, మిగతా పార్టీలకు మూడు నుంచి ఏడు సీట్లు వచ్చే అవకాశాలున్నాయని సర్వేలో తేలింది. కాంగ్రెస్ 49 నుంచి 55 సీట్లు సాధించినప్పటికీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే మెజారిటీ ఉండబోదు. 117 అసెంబ్లీ స్థానాలున్న పంజాబ్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే కనీసం 59 సీట్లు కావాలి.
ఈ నేపథ్యంలో నవజ్యోత్ సింగ్ సిద్ధు ఏర్పాటు చేసిన అవాజ్ ఏ పంజాబ్తో పొత్తు కుదుర్చుకునే అవకాశాలు కనిపిస్తున్నాయని అంటున్నారు. కాగా, మాదక ద్రవ్యాల స్మగ్లింగ్, అవినీతి లాంటి ఆరోపణలు రావడంతో ఈసారి అధికార పార్టీకి పరాజయం తప్పదని అంటున్నారు. పంజాబ్ ముఖ్యమంత్రిగా మళ్లీ అమరీందర్ సింగ్ ఎన్నికయ్యే అవకాశముంది. 2002 నుంచి 2007 వరకు సింగ్ పంజాబ్ సీఎంగా ఉన్నారు.