1984అల్లర్లలో వారి పేర్లు మాత్రమే వెల్లడించిన సీఎం అమరీందర్: టైట్లర్ పేరేదంటూ బాదల్
ఛండీఘర్: 1984 సిక్కు వ్యతిరేక అల్లర్లలో కాంగ్రెస్ ప్రమేయం లేదంటూ లండన్ పర్యటనలో ఆ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పేర్కొనడాన్ని పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ సమర్ధించారు. ఎవరో కొద్దిమంది తప్పితే కాంగ్రెస్ పార్టీకి సిక్కు వ్యతిరేక అల్లర్లలో ఎలాంటి ప్రమేయం లేదని స్పష్టం చేశారు.
సోమవారం అమరీందర్ సింగ్ మీడియాతో మాట్లాడుతూ.. 'ఇందిరాగాంధీ హత్యకు గురైనప్పుడు ఈ అల్లర్ల ఘటనలు చోటుచేసుకున్నాయి. అప్పుడు రాజీవ్ గాంధీ బెంగాల్లోని ఓ విమానాశ్రయంలో ఉన్నారు. కొద్ది మంది వ్యక్తులు మినహా కాంగ్రెస్ పార్టీకి సిక్కు వ్యతిరేక అల్లర్లలో ప్రమేయం లేదు. సజ్జన్ కుమార్, ధర్మేంద్రదాస్ శాస్త్రి, అర్జున్ దాస్, మరో ఇద్దరు వ్యక్తుల పేర్లు నేను చెప్పగలను' అని పేర్కొన్నారు.
టైట్లర్ పేరేది: బాదల్ సూటి ప్రశ్న
కాగా, ఇందిరాగాంధీ హత్యానంతరం చోటుచేసుకున్న సిక్కు వ్యతిరేక అల్లర్లకు సంబంధించి ఐదుగురు పేర్లు ప్రస్తావించిన ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ ఎందుకు జగదీష్ టైట్లర్ విషయంలో మెతకధోరణితో వ్యవహరించారో చెప్పాలని శిరోమణి అకాలీ దళ్ అధ్యక్షుడు సుఖ్బీర్ సింగ్ బాదల్ నిలదీశారు. టైట్లర్ పేరు ప్రస్తావించకపోవడాన్ని తప్పుపట్టారు.
1984లో జరిగిన సిక్కు వ్యతిరేక అల్లర్లలో ప్రధాన సాక్షినంటూ ఆయన (అమరీందర్ సింగ్) సుప్రీంకోర్టుకు లేఖ రాయాలని డిమాండ్ చేశారు బాదల్. ఐదుగురు పేర్లే చెప్పి జగదీష్ టైటర్ల పేరు చెప్పకపోవడాన్ని చూస్తే ఆయన పట్ల మెతకవైఖరితో సీఎం ఉన్నట్టు కనిపిస్తోందన్నారు.