వద్దు... దయచేసి అలాంటి చర్యలకు పాల్పడవద్దు... రైతులకు ముఖ్యమంత్రి విజ్ఞప్తి...
కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న రైతులెవరూ చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకోవద్దని పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ విజ్ఞప్తి చేశారు.కొంతమంది రైతులు సెల్ఫోన్ టవర్లను ధ్వంసం చేస్తున్నారన్న ప్రచారం నేపథ్యంలో ముఖ్యమంత్రి ఇలా స్పందించారు. రైతులు శాంతియుతంగా తమ ఆందోళనలు కొనసాగించాలని ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలిగించరాదని పేర్కొన్నారు. ప్రస్తుత కరోనా కాలంలో ప్రజలకు టెలీకాం కనెక్టివిటీ చాలా ముఖ్యమని.. కాబట్టి సెల్ఫోన్ టవర్లను ధ్వంసం చేయవద్దని కోరారు.
'కేంద్రం తెచ్చిన నల్ల చట్టాలను వెనక్కి తీసుకోవాలని కోరుతున్న రైతుల డిమాండుకు పంజాబ్ ప్రజలు తొలినుంచి వారికి మద్దతుగా నిలుస్తున్నారు. ఈ మద్దతు ఇలాగే కొనసాగుతుంది. రైతులు కూడా ఇప్పటివరకూ పాటించిన సంయమనాన్ని కొనసాగించాలి. ఢిల్లీ బోర్డర్లో క్రమశిక్షణతో,సంయమనంతో రైతులు కొనసాగిస్తున్న ఆందోళన స్పూర్తిని ఇక్కడ కూడా కొనసాగించాలి. ప్రజలకు ఇబ్బందులు కలిగించే చర్యలకు పూనుకోవద్దు.' అని సీఎం అమరీందర్ రైతులకు విజ్ఞప్తి చేశారు.
రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో రైతులు సెల్ఫోన్ టవర్లకు విద్యుత్ సరఫరాను నిలిపివేసినట్లుగా కథనాలు వచ్చాయి. దీంతో ఆయా ప్రాంతాల్లో టెలీ కమ్యూనికేషన్ వ్యవస్థకు అంతరాయం ఏర్పడింది. ప్రస్తుతం విద్యార్థులు కూడా ఆన్లైన్ ఎడ్యుకేషన్ పైనే ఆధారపడిన నేపథ్యంలో... ఇలా సెల్ఫోన్ టవర్లను టార్గెట్ చేయడం సరైనది కాదని అమరీందర్ సింగ్ అన్నారు. చాలామంది వర్క్ ఫ్రమ్ హోమ్ కూడా చేస్తున్నారని... ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని అలాంటి చర్యలకు పాల్పడవద్దని కోరారు.భవిష్యత్తులో టెలికాం రంగంలో మరిన్ని పెట్టుబడులు తీసుకురావాలన్న ప్రభుత్వ లక్ష్యానికి ఇలాంటి దుశ్చర్యలతో నష్టం జరుగుతుందని వాపోయారు.
కాగా,కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ దాదాపు నెల రోజులుగా పంజాబ్ రైతులు ఢిల్లీ సరిహద్దుల్లో ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే. పలు దఫాలుగా కేంద్రం రైతులతో చర్చలు జరిపినా అవేవీ సఫలం కాలేదు. చట్ట సవరణలకు కేంద్రం ముందుకు వచ్చినప్పటికీ రైతులు మాత్రం వాటిని రద్దు చేయాలన్నదే తమ ఏకైక డిమాండ్ అని చెప్తున్నారు. అసలే చలికాలం... ఎముకల కొరికే చలిని సైతం లెక్క చేయకుండా రైతులు ఇంకా తమ ఆందోళనలను కొనసాగిస్తున్నారు. అటు కేంద్రం కూడా వెనక్కి తగ్గే సూచనలు కనిపించట్లేదు. దీంతో ఈ ప్రతిష్ఠంభన ఇంకెంత కాలం కొనసాగుతుందన్న చర్చ జరుగుతోంది.