సీఎం భార్యనే టార్గెట్ చేశాడు.. మొత్తం దోచేశాడు..! వీడు జగత్కంత్రీ..!!
పంజాబ్/ జార్ఖండ్: ఈ మధ్యకాలంలో ఆన్లైన్ మోసాలు ఎక్కువయ్యాయి. అటువైపున్న కస్టమర్ ఎంత బడా వ్యక్తి అయినా సరే ఇట్టే వారి అకౌంట్ల నుంచి డబ్బులు కొట్టేస్తున్నారు ఆన్లైన్ కేటుగాళ్లు. బ్యాంకుల్లో దాచుకున్న సొమ్ము మనకు తెలియకుండానే దొంగలించబడుతోంది. టెక్నాలజీ శరవేగంగా పెరుగుతోంది. అంతే శరవేగంతో ఆన్లైన్ మోసాలు పెరిగిపోతున్నాయి. సాధారణ ప్రజల డబ్బులు ఇంతవరకు ఆన్లైన్ మోసగాళ్లు కొట్టేసేవారు. ఇప్పుడు వారి దృష్టంతా వీఐపీల ఖాతాలపై పడ్డాయి. ఒక్కసారిగా వారి ఖాతాల్లో నుంచి డబ్బులు బదిలీ అయినట్లు మొబైల్కు వచ్చిన మెసేజ్ను చూసి ఖంగుతింటున్నారు. తాజాగా సీఎం భార్యకు కూడా ఇదే పరిస్థితి తలెత్తింది.
సీఎం అమరీందర్ భార్య బ్యాంకు ఖాతా ఖాళీ
పంజాబ్ ముఖ్యంత్రి అమరీందర్ సింగ్ భార్య ఆ రాష్ట్ర ఎంపీ అయిన ప్రినీత్ కౌర్ బ్యాంకు అకౌంట్ నుంచి రూ. 23 లక్షలు దొంగలించారు ఆన్లైన్ నేరగాళ్లు. అయితే ఓ బాధ్యతాయుతమైన పదవిలో ఉండి కూడా ఆమె ఎలా మోసపోయారనేది ప్రశ్నార్థకంగా మారింది. ఓ వారం రోజుల క్రితం ఆమె పార్లమెంటు సమావేశాలకని వెళుతుండగా ఓ అతుల్ అన్సారీ పేరుగల అజ్ఞాత వ్యక్తి నుంచి ప్రినీత్ కౌర్కు ఫోన్ వచ్చింది. తాను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మేనేజర్గా ఫోనులో పరిచయం చేసుకున్నాడు. జీతం అకౌంట్లోకి వేయాలంటూ ప్రినీత్ కౌర్ ఏటీఎం పిన్ నెంబర్ అడిగాడు. అనంతరం ఓ ఓటీపీ తన మొబైల్ నెంబరుకు వస్తుందని చెప్పాడు. ఇక అతుల్ మాటలు నమ్మిన ఎంపీ... ఏటీఎం పిన్ నెంబర్ ఆపై వచ్చిన ఓటీపీ నెంబరు చెప్పేసిన క్షణాల్లోనే ఆమె ఖాతా నుంచి రూ.23 లక్షలు మాయమయ్యాయి. అది కూడా మూడు లావాదేవీలు జరిపి ఈ మొత్తాన్ని కేటుగాడు కొట్టేశాడు. ఇది గమనించిన ప్రినీత్ కౌర్ వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసింది.
ఆన్లైన్ మోసాలకు కర్మాతార్ గ్రామం కేరాఫ్ అడ్రస్
పోలీసులు విచారణ చేయగా జార్ఖండ్లోని జమ్తారా నుంచి ఎంపీకి ఫోన్ వచ్చినట్లు గుర్తించారు. కేసును జమ్తారా ఎస్పీకి అప్పగించారు. పంజాబ్ పోలీసులు, జార్ఖండ్ పోలీసులు ఇద్దరూ కేటుగాడిని పట్టుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. కర్మాతార్ గ్రామంలో కేటుగాడు అతుల్ అన్సారీ ఉన్నట్లు గుర్తించి ఆ ఊరికెళ్లి అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం పంజాబ్ పోలీసుల అదుపులో అతుల్ అన్సారీ ఉన్నాడు. ఒకప్పుడు కర్మాతార్ గ్రామంలో చిన్న చిన్న గుడిసెలు ఉండేవి. అయితే ఆన్లైన్ మోసాల ద్వారా త్వరగా డబ్బులు ఎలా సంపాదించాలో అక్కడి గ్రామస్తులు నేర్చుకున్నారు. ఇలా ఆన్లైన్ మోసాలకు పాల్పడి లక్షలకు లక్షలు దోచేసి పెద్ద పెద్ద భవంతులను కట్టుకున్నారు. ఒకప్పుడు పూరి గుడిసెలతో ఉన్న ఆ గ్రామం నేడు భవంతులు వెలిశాయి. ఇక్కడి గ్రామస్తులు గత ఆరేళ్లలో ఆన్లైన్ మోసాలకు పాల్పడి ఉత్తర్ ప్రదేశ్, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, బీహార్, వెస్ట్ బెంగాల్, ఒడిషా, ఢిల్లీ, మహారాష్ట్ర తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కేరళ, పంజాబ్ మరియు అండమాన్ నికోబార్ దీవుల్లో నివసించే అమాయకపు ప్రజలను లక్ష్యంగా చేసుకుని లక్షలకు లక్షలే దోచేశారు.
సైబర్ నేరగాళ్ల హిట్లిస్టులో అంతా బిగ్ షాట్సే
ఇదిలా ఉంటే ఆన్లైన్ మోసాలు చేయడం జమ్తారాలో 2013లో ప్రారంభమైనట్లు పోలీసులు తెలిపారు. ఇప్పటికే 110 మందిని అరెస్టు చేసినట్లు పోలీసులు చెప్పారు. ఇప్పటి వరకు 90 మంది సైబర్ నేరగాళ్లను గుర్తించామని వారందరికీ రూ. 50 కోట్లకు పైగా ఆస్తులు ఉన్నట్లు సమాచారం. వీరందరినీ ఈడీ విచారణ చేస్తోందని పోలీసులు తెలిపారు. ఇదిలా ఉంటే ఓ కేంద్రమంత్రి నుంచి రూ.1.80 లక్షలు, కేరళ ఎంపీ నుంచి రూ.1.60 లక్షలు, బీజేపీ ఎమ్మెల్యే నుంచి రూ. 5వేలు ఆన్లైన్ కేటుగాళ్లు దోచేశారు. వీరిని విచారణ చేయగా వీరందరూ కర్మాతార్ గ్రామస్తులుగా తేలింది.