కొవాగ్జిన్పై బీజేపీ తప్పుడు ప్రచారం -దేశీ టీకాను పంజాబ్ వద్దనలేదు: వ్యాక్సిన్ తీసుకున్న సీఎం అమరీందర్
కేంద్ర ప్రభుత్వ సహకారంతో భారత్ బయోటెక్ తయారుచేసిన కొవాగ్జిన్ టీకాపై బీజేపీ తప్పుడు ప్రచారం సాగిస్తోందని పంజాబ్ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ మండిపడ్డారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు కరోనా వైరస్ కట్టడికి రూపొందిన దేశీ వ్యాక్సిన్ కొవాగ్జిన్ను తిరస్కరిస్తున్నాయని బీజేపీ చేసిన ఆరోపణలను ఆయన తోసిపుచ్చారు.
పంజాబ్ సర్కారు కొవాగ్జిన్ ను నిరాకరించిందనడం పూర్తిగా అవాస్తవమని, ఇది రాజకీయ దురుద్దేశంతో బీజేపీ చేస్తున్న దుష్ప్రచారమని కెప్టెన్ వ్యాఖ్యానించారు. మొహాలిలోని సివిల్ ఆస్పత్రిలో శుక్రవారం కొవిడ్-19 వ్యాక్సిన్ తొలి డోసు తీసుకున్న అనంతరం సీఎం మీడియాతో మాట్లాడారు.
పంజాబ్ సహా విపక్ష పాలిత రాష్ట్రాలు వ్యాక్సిన్పై సందేహాలతో వ్యాక్సినేషన్ను నిరాకరిస్తున్నాయని బీజేపీ అధికార ప్రతినిధి, పూరీ ఎంపీ సంబిత్ పాత్ర చేసిన ఆరోపణలపై కెప్టెన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వ్యాక్సినేషన్పై ప్రజల్లో ఉన్న భయాన్ని పోగొట్టి అవగాహన కల్పించేలా మీడియా చొరవ చూపాలని ఆయన కోరారు. కరోనా మహమ్మారి ఇంకా వెంటాడుతోందని ప్రజలు మాస్క్లు ధరించి కరోనా మార్గదర్శకాలను అనుసరించాలని అమరీందర్ సింగ్ కోరారు. కాగా,
పంజాబ్ లో వైరస్ వ్యాప్తి ఉధృతి మళ్లీ పెరగడం అందరినీ కలవరపెడుతోంది. 2020 నవంబర్ తర్వాత నుంచి దాదాపు తగ్గుతూ వచ్చిన కేసులు.. మళ్లీ 2021 మార్చి తొలివారం నాటికి తారాస్థాయికి చేరాయి. గురువారం ఒక్కరోజే అత్యధికంగా 1071 కొత్త కేసులు వెలుగులోకి వచ్చాయి. శుక్రవారం కొత్తగా 808 కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసులు 1.86లక్షలకు, డిశ్చార్జీలు 1.73లక్షలకు పెరిగాయి. ఇవాళ ఒక్కరోజే 11 మంది ప్రాణాలు కోల్పోయారు. కరోనా వల్ల ఇప్పటిదాకా 5,898మంది చనిపోయారు.