బతుకు ఛిద్రం: ఒక్క సిటీలో వందమందికి పైగా ఆత్మహత్య: 3 నెలల్లో.. 30-40 ఏళ్ల వయస్సున్న వారే
చండీగఢ్: కరోనా వైరస్ దేశ ఆర్థిక వ్యవస్థనే కాదు.. సాధారణ ప్రజల జీవనాన్ని కూడా ఛిద్రం చేసింది. వేలాది కుటుంబాలను రోడ్డున పడేసింది. లక్షలాదిమంది ప్రజలకు ఉపాధిని దూరం చేసింది. భవిష్యత్తు పట్ల భయాందోళనలను కలిగించింది. వందల కిలోమీటర్ల దూరాన్ని కాలి నడకన అధిగమించి స్వస్థలాలకు చేరుకున్నా.. ఎలాంటి ఆర్థిక ప్రయోజనం గానీ, ఉపాధి గానీ లభించకపోవడంతో బలవన్మరణానికి పాల్పడాల్సిన దుస్థితిని కల్పించింది.
పంజాబ్లోని లూధియానాలో
కరోనా వైరస్ వ్యాప్తి చెందడాన్ని నివారించడానికి దేశవ్యాప్తంగా అమలు చేస్తోన్న లాక్డౌన్ వల్ల పంజాబ్లోని లూధియానా వందమందికి పైగా ఆత్మహత్య చేసుకున్నారు. మూడు నెలల లాక్డౌన్ సమయంలోనే ఈ ఆత్మహత్యలు చోటు చేసుకోవడం దిగ్భ్రాంతిని కలిగిస్తోంది. ఈ మూడు నెలల కాలంలో 1500లకు పైగా గృహహింస కేసులు నమోదు కావడం ఇంకో ఎత్తు. లాక్డౌన్ వల్ల కాలు బయటపెట్టలేని దుస్థితిని ఎదుర్కొన్న లూధియానావాసులు ఆత్మహత్యకు పాల్పడ్డారు.
30 నుంచి 40 సంవత్సరాల లోపు
లాక్డౌన్ సమయంలో వేర్వేరు రూపాల్లో 100 మంది ఆత్మహత్య చేసుకున్నారని పోలీస్ డిప్యూటీ కమిషనర్ అఖిల్ చౌధరి వెల్లడించారు. వారంతా 30 నుంచి 40 సంవత్సరాల లోపు వయస్సున్న వారేనని తెలిపారు. అదే సమయంలో 1500లకు పైగా గృహహింస కేసులు నమోదు అయ్యాయని, వాటన్నింటిపైనా దర్యాప్తు చేస్తున్నామని అన్నారు. లాక్డౌన్ను అమలు చేయడానికి ముందు ఏడాది పొడవునా 60 ఆత్మహత్యలు నమోదు కాగా.. లాక్డౌన్ను అమల్లోకి తీసుకొచ్చిన మూడు నెలల కాలంలోనే వంద బలవన్మరణాలు నమోదు అయ్యాయని చెప్పారు.
ఉపాధి కోల్పోయి.. ఆర్థిక సమస్యల్లో చిక్కుకుని..
బలవన్మరణానికి పాల్పడిన వారిలో చాలామంది చిరుద్యోగులు, దినసరి వేతన కార్మికులు ఉన్నారని అన్నారు. లాక్డౌన్ వల్ల వారంతా ఉపాధిని కోల్పోయే పరిస్థితులను ఎదుర్కొన్నారని చెప్పారు. ఫలితంగా ఆర్థిక సమస్యల్లో చిక్కుకున్నారని, అందులో నుంచి గట్టెక్కే మార్గం కనిపించకపోవడం వల్ల బలవన్మరణాలకు పాల్పడినట్లు ప్రాథమికంగా నిర్ధారించామని అఖిల్ చౌధరి తెలిపారు. ఆయా సంఘటనలపై సమగ్రంగా దర్యాప్తు నిర్వహిస్తున్నట్లు చెప్పారు.
డిప్రెషన్ వల్లా
ఆర్థికంగా మెరుగ్గా ఉన్న కుటుంబాలకు చెందిన వారు కూడా ఆత్మహత్యకు పాల్పడినట్లు తమ దర్యాప్తులో తేలిందని అన్నారు. దీనికి ప్రధాన కారణం.. డిప్రెషన్ అయి ఉండొచ్చని అనుమానిస్తున్నట్లు చెప్పారు. మరికొందరు పొరుగు రాష్ట్రాలకు ఉపాధి అవకాశాల కోసం తిరిగి వచ్చిన వారు ఉన్నారని పేర్కొన్నారు. లాక్డౌన్ వల్ల మానసిక ఒత్తిళ్లకు గురై ఉంటారని, ఆర్థిక ఇబ్బందులు తప్పకపోవచ్చనే నిరాశతో ఆత్మహత్య చేసుకుని ఉండొచ్చని విశ్లేషిస్తున్నట్లు తెలిపారు. లాక్డౌన్ సమయంలో 1500 గృహహింస కేసులు నమోదు అయ్యాయని, అవన్నీ డిప్రెషన్ వల్లే సంభవించి ఉంటాయని భావిస్తున్నట్లు చెప్పుకొచ్చారు.