అమరీందర్ సింగ్కు మోడీ... మోడీకి రాహుల్ శుభాకాంక్షలు..
ప్రధాని మోడీ పంజాబ్ కాంగ్రెస్ అభ్యర్థి అమరీందర్ సింగ్ కు ఫోన్ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు.
న్యూఢిల్లీ: యూపీ ఎన్నికల్లో ఘనవిజయం బీజేపీని తిరుగులేని శక్తిగా మార్చింది. దీంతో కమలనాథుల్లో నూతనోత్సాహం వెల్లివిరుస్తోంది. అదే సమయంలో పంజాబ్,గోవా రాష్ట్రాల్లో ప్రతికూల ఫలితాలను మూటగట్టుకుంది. అయినా యూపీ విజయం ముందు అవి బీజేపీ మీద అంతగా ప్రభావం చూపవని అందరికీ తెలిసిందే.
మరోవైపు పంజాబ్ లో కాంగ్రెస్ స్పష్టమైన మెజారిటీతో జయకేతనం ఎగరవేసింది. ఈ నేపథ్యంలో ప్రధాని మోడీ పంజాబ్ కాంగ్రెస్ అభ్యర్థి, మాజీ సీఎం అమరీందర్ సింగ్ కు ఫోన్ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. ఇదే రోజు అమరీందర్ సింగ్ పుట్టినరోజు కూడా కావడంతో.. పుట్టినరోజు శుభాకాంక్షలు కూడా చెప్పారు.
ఫోన్ ద్వారా అమరీందర్ సింగ్ కు శుభాకాంక్షలు చెప్పిన మోడీ.. అనంతరం అదే విషయాన్ని ట్విట్టర్ ద్వారా వ్యక్తపరిచారు. కాగా, కాంగ్రెస్ అభ్యర్థి అమరీందర్ సింగ్.. లంబి, పాటియాలా రెండు చోట్ల పోటీ చేయగా.. లంబిలో పరాజయం పాలయ్యారు. పాటియాలలో మాత్రం 51వేల మెజారిటీతో విజయం సాధించారు. ప్రస్తుతం పంజాబ్ లో కాంగ్రెస్ 74స్థానాలు గెలుచుకుని మరో మూడు స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది.
రాహుల్ శుభాకాంక్షలు:
పంజాబ్ లో కాంగ్రెస్ విజయం సాధించడంతో రాహుల్ ఆ పార్టీ అభ్యర్థి అమరీందర్ సింగ్ కు శుభాకాంక్షలు తెలిపారు. అదే సమయంలో యూపీ, ఉత్తరాఖండ్ లో విజయం సాధించిన బీజేపీకి సైతం రాహుల్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఇక ఎన్నికల పరాజయాన్ని పరోక్షంగా ప్రస్తావిస్తూ.. ప్రజల మనసులు గెలుచుకునేంతవరకు తమ పోరాటం ఆగదని ట్విట్టర్ ద్వారా పేర్కొన్నారు.