Captain Amarinder Singh:బీజేపీలోకి మాజీ సీఎం..నడ్డా-షాలతో భేటీ..?
పంజాబ్ కాంగ్రెస్కు భారీ జలక్ ఇవ్వనున్నారు మాజీ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్. కెప్టెన్ అమరీందర్ సింగ్ ముఖ్యమంత్రిగా ఉండగా కొందరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేయడంతో తప్పని పరిస్థితుల్లో ఆయన తన పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. ఇక రాజీనామా చేసిన తర్వాత సొంత పార్టీపైనే విమర్శలు గుప్పిస్తూ వచ్చిన అమరీందర్ సింగ్ తాజాగా ఓ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. త్వరలో తాను బీజేపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే మంగళవారం సాయంత్రం బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డాను ఆ తర్వాత కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను కలవనున్నారు.
ఇక ఢిల్లీలో మంగళవారం బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డాను ఆ తర్వాత అమిత్షాను కలిసేందుకు మధ్యాహ్నం 3 గంటలకు ఢిల్లీ బయలు దేరి వెళ్లనున్నారు అమరీందర్ సింగ్. కేంద్ర మంత్రి రాందాస్ అథవాలే అమరీందర్ సింగ్ను ఎన్డీయేలోకి ఆహ్వానించారు. తనను అవమానించిన పార్టీని వీడి బీజేపీలో చేరాలంటూ ఇక్కడ సముచిత స్థానం దక్కుతుందని మంత్రి అథవాలే మీడియాతో మాట్లాడుతూ చెప్పారు. ఇక ఎన్డీయేను అధికారంలోకి తీసుకురావడంలో కెప్టెన్ అమరీందర్ సింగ్ సేవలు పార్టీ వినియోగించుకుంటుందని చెప్పారు.
ఇక పంజాబ్ కాంగ్రెస్లో జూలై నెల నుంచి లుకలుకలు ప్రారంభమయ్యాయి. నవజ్యోత్ సింగ్ సిద్ధూను కాంగ్రెస్ అధిష్టానం పీసీసీ చీఫ్గా నియమించడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు కెప్టెన్ అమరీందర్ సింగ్. ఇక అప్పటి నుంచి ఇద్దరి మధ్య కోల్డ్ వార్ నడుస్తోంది. క్రమంగా ఎమ్మెల్యేలు కెప్టెన్ అమరీందర్ సింగ్పై అసంతృప్తి వ్యక్తం చేయడం అమరీందర్ను తప్పించాలని పట్టుబట్టడంతో ఈ వార్ మరింత ముదిరింది. దీంతో కెప్టెన్ అమరీందర్ సింగ్ పంజాబ్ ముఖ్యమంత్రిగా సెప్టెంబర్ 18న రాజీనామా చేశారు. ఆ వెంటనే చన్నీని కాంగ్రెస్ అధిష్టానం ముఖ్యమంత్రిగా ప్రకటించడం ఆయన ప్రమాణ స్వీకారం చేయడం ఈ రోజు మంత్రి పోర్ట్ఫోలియోలను ప్రకటించడం అన్నీ చకచకా జరిగిపోయాయి.
ఇదిలా ఉంటే అమరీందర్ సింగ్ బీజేపీలోకి వెళ్లకుండా కాంగ్రెస్ అధిష్టానం చర్చలు జరిపేందుకు ప్రయత్నాలు చేస్తోందని తెలుస్తోంది. కానీ వారికెవరికీ అమరీందర్ సింగ్ అందుబాటులోకి రావడం లేదని సమాచారం. కెప్టెన్ అమరీందర్ సింగ్ సీఎం పదవికి రాజీనామా చేశాక నవజ్యోత్ సింగ్ సిధ్దూ పై ఘాటు వ్యాఖ్యలు చేశారు. తను దేశానికి ద్రోహం చేస్తున్నాడని, పాకిస్తాన్తో సత్సంబంధాలు నడుపుతున్నారని అలాంటి వ్యక్తి వచ్చే ఎన్నికల్లో సీఎంగా కాకుండా తాను అడ్డుకుంటానని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం పంజాబ్లో బీజేపీకి ఎవరూ మిత్రపక్షం లేరు. ఇదివరకున్న శిరోమణి అకాలీదళ్ పార్టీ కూడా రైతు పక్షాన నిలబడి ఎన్డీయే కూటమి నుంచి బయటకొచ్చింది. తాజాగా అమరీందర్ సింగ్ బీజేపీలో చేరుతున్నట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో ఆయన చేరిక పార్టీకి కాస్త ప్లస్ కావొచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.