మందు, సిగరెట్ జాబితాలో చేరిన మొబైల్... దేశంలో మొదటి డీ ఎడిక్షన్ సెంటర్ ప్రారంభం..
అమృత్సర్ : పది మంది కూర్చొని ఉంటారు అయినా అక్కడ నిశ్శబ్దం. సంబరాలు జరుగుతుంటాయి. కానీ సందడి మాత్రం కనిపించదు. ఇల్లు పీకి పందిరేయాల్సి పిల్లలు కామ్గా కూర్చొని ఫుల్ కాన్సస్ట్రేషన్తో గేమ్స్ ఆడేస్తుంటారు. దీనంతటకీ కారణం స్మార్ట్ఫోన్. ప్రపంచంలో మెజార్టీ ప్రజలు స్మార్ట్ఫోనే లోకంగా బతుకుతున్నారు. చిన్నా పెద్ద తేడా లేదు.. పసివాళ్ల నుంచి పండు ముసలి వరకు అందరూ ఫోన్కు బానిసైపోతున్నారు.
తాగుతూ... తుపాకులతో చిందేసిన బీజేపీ ఎమ్మెల్యేపై వేటు... పార్టీ నుండి బహిష్కరణ
సెల్ఫోన్కు బానిసలవుతున్న జనం
సెల్ఫోన్ చేతిలో ఉంటే చాలు జనం ప్రపంచాన్నే మరిచిపోతున్నారు. తిండి, నిద్ర, ఫ్రెండ్స్, బంధువులతో సంబంధం లేదు. పరిస్థితి ఎంత దారుణంగా మారిందంటే ఉదయం లేవగానే ఫోన్ కనిపించకపోతే కాళ్ల కింద భూమి కంపించే పోయేంతగా జనం మొబైల్కు అడిక్ట్ అయ్యారు. ఈ వ్యసనాన్నివదిలించుకునేందుకు చాలా మంది సైకియాట్రిస్టుల దగ్గరకు వెళ్లడం ఈ మధ్య కాలంలో పెరిగిపోయింది. ఈ పరిస్థితి గ్రహించిన పంజాబ్లోని ఓ హాస్పిటల్ కొత్తగా మొబైల్ డీ ఎడిక్షన్ సెంటర్ ఏర్పాటు చేసింది.
మొట్టమొదటి డీఎడిక్షన్ సెంటర్
ఏడాది నిండని పిల్లల మొదలు స్కూల్ విద్యార్థులు, పెద్దలు అందరూ సెల్ఫోన్లకు బానిసై మానసికంగానే కాదు.. శారీరకంగానూ నానా ఇబ్బందులు పడుతున్నారు. అమృత్సర్లోని ప్రైవేట్ హాస్పిటల్కు గత కొంతకాలంగా మొబైల్ ఎడిక్షన్తో బాధపడుతూ కౌన్సిలింగ్ కోసం వస్తున్న వారి సంఖ్య పెరిగిపోయింది. దీంతో న్యూరోసైకియాట్రిస్ట్ అయిన డాక్టర్ జగ్దీప్ పాల్కు కొత్త ఆలోచన వచ్చింది. ఇలాంటివారి కోసం డిజిటల్ డీటాక్స్ సెంటర్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ప్రత్యేకంగా ఓ విభాగం ఏర్పాటు చేసి మొబైల్ ఎడిక్షన్తో బాధపడుతున్నవారిని మామూలు మనుషుల్ని చేస్తామని చెబుతున్నారు.
నెలల వయసులోనే ఫోన్కు బానిస
ముక్కుపచ్చలారని చిన్నారులు సైతం మొబైల్ ఫోన్కు బానిసలవుతుండటం ఆందోళన కలిగిస్తోంది. చండీఘడ్కు చెందిన పరమ్జీత్ కౌర్ కూతురు వయసు తొమ్మిది నెలలు. పసిపాప ఏడుపు ఆపేందుకు తల్లి మొబైల్ ఫోన్ ఇచ్చింది. ఇక అప్పటి నుంచి మొబైల్తో ఆడుకోవడం మొదలుపెట్టిన చిన్నారి దానికి ఎంతగా బానిసైందంటే తన చేతిలోని ఫోన్ తీసుకుంటే చాలు ఏడుపు మొదలుపెడుతోంది. దీంతో ఆందోళన చెందిన తల్లి ఆ పసిపాపను పంజాబ్లోని డీ ఎడిక్షన్ సెంటర్కు తీసుకురాక తప్పలేదు.
తల్లిదండ్రులు కూడా కారణం
పిల్లలు సెల్ఫోన్లకు బానిసవడానికి తల్లిదండ్రులే కారణమని నిపుణులు అంటున్నారు. తాము ఇంట్లో పని చేసుకునేటప్పుడు పిల్లలు సతాయించకుండా ఉండేందుకు వారి చేతికి సెల్ఫోన్లు ఇస్తున్నారు. ఇదే ఆ తర్వాత వారికి వ్యసనంగా మారుతోంది. ఉద్యోగాలు చేసే తల్లిదండ్రులు ఉండే ఇళ్లలో పరిస్థితి ఇంకా దారుణంగా ఉంది. ఏదేమైనా పిల్లలు మొబైల్ ఫోన్లకు బానిస అయితే ఆ వ్యసనం నుంచి తప్పించేందుకు ఎలాంటి మందులు లేవన్న విషయాన్ని పేరెంట్స్ గుర్తిస్తే సమస్య చాలా వరకు పరిష్కారం అవుతుంది.