జమ్మూ కాశ్మీర్ లో పప్పులుడకట్లేదు: ఇక పంజాబ్ పై కన్ను.. హై అలర్ట్
చండీగఢ్: పాకిస్తాన్ సరిహద్దులకు ఆనుకుని ఉన్న పంజాబ్ కు ఉగ్రవాదుల ముప్పు పొంచి ఉందా? పుల్వామా తరహాలో ఆత్మాహూతి దాడులు చోటు చేసుకునే అవకాశాలు ఉన్నాయా? అంటే అవుననే చెబుతున్నాయి ఇంటెలిజెన్స్ వర్గాలు. పంజాబ్లో ఉగ్రదాడులు జరిగే అవకాశముందని ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరించాయి. దీనితో పంజాబ్ ప్రభుత్వం రాష్ట్రంలో హై అలర్ట్ ప్రకటించింది. భద్రతా దళాలను భారీగా మోహరింపజేసింది.
కాశ్మీరీ అమ్మాయిలపై బీజేపీ ఎమ్మెల్యే అసభ్యకర కామెంట్స్: వారిని పెళ్లాడాలని తెగ ఉబలాటంగా ఉందట!
జమ్ము కాశ్మీర్కు స్వయం ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370ను రద్దు చేసిన అనంతరం పాకిస్తాన్ ప్రోత్సాహిత, ఆ దేశాన్ని కేంద్రబిందువుగా చేసుకుని సరిహద్దుల్లో యథేచ్ఛగా తమ కార్యకలాపాలు నిర్వహిస్తున్న జైషె మహమ్మద్, లష్కర్-ఎ-తొయిబా వంటి ఉగ్రవాద సంస్థలు ఆత్మాహూతి దాడులు పాల్పడే ప్రమాదం ఉన్నట్లు ఇంటెలిజెన్స్ వర్గాలు వెల్లడించాయి.
జమ్మూ కాశ్మీర్ సరిహద్దుల్లో వారం రోజుల వ్యవధిలో సుమారు 12 మందికి పైగా ఉగ్రవాదులు సరిహద్దులను దాటుకుని భారత భూభాగంపైకి చొరబడటానికి చేసిన ప్రయత్నాలను ఉదహరిస్తున్నాయి. భారత్, పాకిస్తాన్ సరిహద్దుల్లో ఉగ్రవాదుల కదలికలు పెద్ద ఎత్తున చోటు చేసుకుంటున్నట్లు ఇంటెలిజెన్స్ వర్గాలు గుర్తించాయి.
జమ్మూ కాశ్మీర్ లో వేల సంఖ్యలో అదనపు భద్రతా బలగాలు మోహరించి ఉన్న నేపథ్యంలో.. ప్రస్తుతం ఉగ్రవాదుల దృష్టి పంజాబ్ పై పడిందని, ఈ క్రమంలో వారు సరిహద్దులను దాటుకుని భారత్ లో చొరబడటానికి ప్రయత్నాలు చేయవచ్చని హెచ్చరించాయి.
దీనితో పంజాబ్ ప్రభుత్వం హై అలర్ట్ ను ప్రకటించింది. జమ్మూ కాశ్మీర్ సహా పాకిస్తాన్ సరిహద్దుల్లో పెద్ద ఎత్తన తనిఖీలు నిర్వహిస్తోంది. జమ్మూ కాశ్మీర్ వైపు నుంచి పంజాబ్ కు దారి తీసే అన్ని మార్గాల వద్ద చెక్ పోస్టులను బలోపేతం చేసింది. అదనపు బలగాలను మోహరింపజేసింది.