ఆ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు డోప్ టెస్టులు
పంజాబ్ రాష్ట్రంలో డ్రగ్స్ సరఫరా చేస్తున్నవారికి,డ్రగ్స్ విక్రయిస్తున్నవారికి ఉరిశిక్ష అమలు చేయాలంటూ కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్కు పంజాబ్ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ లేఖ రాసిన కొద్ది గంటల్లోనే మరో కఠినమైన నిర్ణయం ఆయన తీసుకున్నారు. పంజాబ్ ప్రభుత్వ ఉద్యోగులందరికీ డోప్ టెస్టులు నిర్వహించాలంటూ ఆదేశాలు జారీ చేశారు. పోలీసులకు కూడా డోప్ టెస్టులు నిర్వహించాలని ఆదేశాలు ఇచ్చారు.
ప్రభుత్వ ఉద్యోగులకు డోప్ టెస్టు నిర్వహణ సాధ్యసాధ్యాలపై త్వరగా ఓ నివేదిక రూపొందించి నోటిఫికేషన్ జారీ చేయాలని అమరీందర్ సింగ్ ఛీఫ్ సెక్రటరీని ఆదేశించారు. కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్కు రాసిన లేఖలో డ్రగ్స్ సరఫరాదారులపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. పంజాబ్ ప్రభుత్వం డ్రగ్స్ దందాపై కఠినంగా వ్యవహరిస్తోందన్నారు .ప్రస్తుతం ఉన్న చట్టాలను మరింత కఠినతరం చేస్తామని కెప్టెన్ అమరీందర్ సింగ్ లేఖలో చెప్పారు.