అవినీతి మరక.. పంజాబ్ మంత్రిపై వేటు.. వెంటనే అరెస్ట్
అవినీతి మకిలీని ఉపేక్షించోమని ఆప్ చెబుతోంది. ప్రభుత్వంలోని పెద్దలు అవినీతికి పాల్పడిన చర్యలు తప్పవని అంటుంది. పంజాబ్ సీఎం భగవంత్ మాన్ ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి విజయ్ సింగ్లాపై చర్యలు తీసుకున్నారు. అవినీతి ఆరోపణలు రావడంతో పదవి నుంచి తొలగించారు. తన శాఖకు సంబంధించిన కాంట్రాక్టుల్లో ఒకశాతం వాటా ఇవ్వాలని సింగ్లా డిమాండ్ చేసినట్లు ఆధారాలు ఉండటంతో భగవంత్ మాన్ ఈ నిర్ణయం తీసుకున్నారు.
కేబినెట్ నుంచి తొలగించిన నిమిషాల వ్యవధిలో అవినీతి నిరోధక శాఖ విజయ్ సింగ్లాను అరెస్ట్ చేసింది. మంత్రి విజయ్ సింఘాల్పై అవినీతి ఆరోపణలు రావడంతో ఆయనను కేబినెట్ నుంచి తొలగించినట్లు భగవంత్ మాన్ ప్రకటించారు. ఆయనపై కేసు నమోదు చేయాలని పోలీసులను ఆదేశించామని చెప్పారు. తమ ప్రభుత్వం అవినీతిని ఏ మాత్రం ఉపేక్షించదని స్పష్టం చేశారు.
అవినీతి ఆరోపణలపై మంత్రిని కేబినెట్ నుంచి తొలగించి అరెస్ట్ చేయించడం దేశ చరిత్రలో రెండోసారి. 2015లో ఆప్ కన్వీనర్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తన మంత్రివర్గ సహచరుడిపై అవినీతి ఆరోపణలు రావడంతో అతనిపై వేటు వేశారు. తాజాగా భగవంత్ మాన్ నిర్ణయాన్ని ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ ప్రశంసించారు. ఈ నిర్ణయంతో జాతి యావత్తూ ఆప్ను చూసి గర్వపడుతుందని చెప్పారు.