పఠాన్కోట్లో అనుమానిత పాక్ గూఢచారి అరెస్ట్
పఠాన్కోట్: పాకిస్థాన్ నిఘా సంస్థ ఐఎస్ఐ గూఢచారిగా అనుమానిస్తున్న ఓ వ్యక్తిని పంజాబ్లోని పఠాన్కోట్లో పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. ఇర్షాద్ అహ్మద్ అనే వ్యక్తి మమూన్ కంటోన్మెంట్లోని 29వ డివిజన్ హెడ్క్వార్టర్స్లో కూలిగా పనిచేస్తున్నాడు.
అహ్మద్ పాక్కు గూఢచారిగా వ్యవహరిస్తున్నట్లు తమకు సమాచారం వచ్చిందని పోలీసులు తెలిపారు. దీంతో అతన్ని అరెస్టు చేసి విచారిస్తున్నారు. అహ్మద్ మొబైల్లో అనుమానాస్పద ఇన్స్టలేషన్స్ ఉన్నట్లు నిఘా వర్గాల సమాచారం. పఠాన్కోట్కు సంబంధించి పలు ఫొటోలు కూడా ఉన్నట్లు గుర్తించారు.
పఠాన్కోట్ దాడిలో ఇతను కూడా భాగస్వామి అయి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. పఠాన్కోట్లోని ఎయిర్ఫోర్స్పై జనవరి నెలలో ఉగ్రవాదులు దాడి చేసిన విషయం తెలిసిందే. ఉద్రవాదుల దాడిలో ఏడుగురు జవాన్లు మృతి చెందగా, భద్రతా దళాల కాల్పుల్లో ఆరుగురు ఉగ్రవాదులు హతమయ్యారు.
అప్పటి నుంచి ఈ ప్రాంతంలో భద్రతను కట్టుదిట్టం చేశారు. అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే జమ్మూకాశ్మీర్లో ఆయుధాలతో పోలీసులకు పట్టుబడిన సజ్జద్ అనే అనుమానితుడ్ని విచారించగా.. ఇర్షద్ సమాచారం బయటపెట్టినట్లు తెలిసింది. ఇర్షద్ పంపిన సమాచారంతోనే ఉగ్రవాదులు దాడులకు పాల్పడినట్లు అనుమానిస్తున్నారు.