రాధే మా కు నోటీసులు ఇచ్చిన పంజాబ్ పోలీస్
చండీగడ్: ఆధ్యాత్మిక దేవత (గాడ్ వూమెన్) రాధే మా అలియాస్ సుఖ్వీందర్ కౌర్ కు పంజాబ్ పోలీసులు నోటీసులు జారీ చేశారు. విచారణకు హాజరు కావాలని నోటీసులలో సూచించారు. హిందూ మత విశ్వాసాలను కించపరిచారని పంజాబ్ లోని పగ్వారా నివాసి సురేందర్ మిట్టల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
రాధే మా తనను డబ్బులు ఇవ్వాలని బెదిరించారని అతను ఫిర్యాదు చేశారు. డబ్బులు ఇవ్వనందుకు తనను అంతం చేస్తామని బెదిరించారని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆదివారం రాత్రి పంజాబ్ పోలీసు అధికారి ఒకరు ముంబై వెళ్లి రాధే మాకు నోటీసులు జారీ చేశారు.
రాధే మాతో మాట్లాడినప్పుడు సురేందన్ మిట్టల్ రికార్డు చేసిన సంభాషణలను పోలీసు అధికారులకు అందజేశారు. రాధే మాతో పాటు ఆమె సోదరి రజ్జో, కోడలు మేఘా, సహాయకురాలు రీతూ సరీన్, రాధే మా అనుచరుడు సంజీవ్ గుప్తా లపై సురేందర్ మిట్టల్ పోలీసు అధికారులకు ఫిర్యాదు చేశారు.
రాధే మా అసభ్యత, అశ్లీలతను ప్రచారం చేస్తున్నారని, మత విశ్వాసాలను దెబ్బ తీస్తున్నారని సురేందర్ మిట్టల్ ఆరోపించారు. ఇప్పటికే ముంబై పోలీసులు రాధే మా మీద వరకట్నం వేదింపుల కేసు నమోదు చేసి విచారణ చేస్తున్న విషయం తెలిసిందే.
మిని స్కర్ట్ లు వేసుకుని ఫోజు ఇస్తున్న ఫోటోలు బయటకు వచ్చినప్పటి నుంచి రాధే మా మీద పలు ఆరోపణలు వస్తున్నాయి. అనేక మంది ఆమె మీద ఫిర్యాదులు చెయ్యడంతో పోలీసులు కేసు నమోదు చేస్తున్నారు. ఇక మీద రాధే మా మీద ఎన్ని ఫిర్యాదులు వస్తాయో తెలియదని పోలీసు అధికారులు అంటున్నారు.