పబ్జీ.. రూ.16లక్షలు మాయం చేసిన కొడుకు... తల్లిదండ్రులకు కోలుకోలేని షాక్..
పబ్జీ... మొదట్లో కాలక్షేపం కోసం,సరదా కోసం మొదలుపెట్టి... ఆ తర్వాత దీనికి ఎడిక్ట్ అయిపోయినవాళ్లు కోకొల్లలు. కొంతమందికి పబ్జీ పిచ్చి పీక్స్కి వెళ్లి ఆత్మహత్య చేసుకున్న సంఘటనలు కూడా ఉన్నాయి. తాజాగా పబ్జీకి సంబంధించి ఓ ఆశ్చర్యకర సంఘటన వెలుగుచూసింది. 17 ఏళ్ల ఓ టీనేజర్ పబ్జీ కోసం తల్లిదండ్రులకు తెలియకుండా ఏకంగా రూ.16లక్షలు ఖర్చు చేశాడు. అది కూడా తన తండ్రి మెడికల్ అవసరాల కోసం దాచుకున్న డబ్బు కావడం గమనార్హం. పంజాబ్లోని ఖరార్లో ఈ ఘటన వెలుగుచూసింది.
ఆన్లైన్ క్లాసుల సాకుతో...
కరోనా వైరస్ నేపథ్యంలో అన్ని రాష్ట్రాల్లోనూ విద్యా సంస్థలు మూతపడి కేవలం ఆన్లైన్ విద్యా బోధన జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పంజాబ్లోని ఖరార్కి చెందిన ఓ బాలుడు(17) ఆన్లైన్ క్లాసులు వినేందుకు ప్రతీరోజూ తన తల్లి స్మార్ట్ఫోన్ను తీసుకునేవాడు. అయితే ఆన్లైన్ క్లాసుల సాకుతో అతను స్మార్ట్ఫోన్ తీసుకుని పబ్జీకి ఎడిక్ట్ అయ్యాడు. ఎంతలా అంటే... పబ్జీ మొబైల్ అకౌంట్ అప్గ్రేడ్,ఇన్-యాప్ కొనుగోళ్ల కోసం ఏకంగా రూ.16లక్షలు ఖర్చు చేశాడు. పబ్జీలో తన టీమ్ మేట్స్కు కూడా అతనే డబ్బులు పెట్టి మొబైల్ అకౌంట్ అప్గ్రేడ్ చేయించాడు.
షాక్ తిన్న తల్లిదండ్రులు...
తల్లిదండ్రుల కథనం ప్రకారం.. వారి బ్యాంకు ఖాతాల వివరాలన్నీ కుమారుడికి తెలుసు. ఇదే అదనుగా అతను ఆ ఖాతాల్లోని డబ్బును పబ్జీ కోసం వాడాడు. అకౌంట్ నుంచి లావాదేవీలు జరిపినట్లుగా మెసేజ్ రాగానే వాటిని డిలీట్ చేసేవాడు. అలా చాలా రోజులు అతని తల్లిదండ్రులు ఈ విషయాన్ని గమనించలేదు. ఇటీవల బ్యాంకు స్టేట్మెంట్స్ పరిశీలించడంతో భారీ మొత్తంలో లావాదేవీలు జరిగినట్లు తెలిసి షాక్ తిన్నారు.
అతని తండ్రి ఏమంటున్నారు...
పేరు వెల్లడించేందుకు ఇష్టపడని ఆ బాలుడి తండ్రి మాట్లాడుతూ... తానో ప్రభుత్వ ఉద్యోగిని అని తెలిపారు. తాను జీవితాంతం కష్టపడి కూడబెట్టిన డబ్బును తన కొడుకు పబ్జీ కోసం వెచ్చించాడని ఆవేదన వ్యక్తం చేశారు. తాను అనారోగ్యంతో బాధపడుతున్నానని.. కాబట్టి తనకు,అలాగే భవిష్యత్తులో తన కొడుక్కి ఆ డబ్బు ఉపయోగపడుతుందనుకున్నానని చెప్పారు. తాను ఉద్యోగ రీత్యా వేరే ప్రాంతంలో ఉంటున్నందునా తన కొడుకు ఏం చేస్తున్నాడో కనిపెట్టలేకపోయానని,తన భార్య కూడా కొడుకుపై నమ్మకంతో అంత సీరియస్గా తీసుకోలేదని అన్నారు. అంతేకాదు,తల్లికి చెందిన పీఎఫ్ ఖాతా నుంచి కూడా అతను రూ.2లక్షలు పబ్జీ ఖర్చు చేసినట్లు వాపోయారు.
మెకానిక్ షెడ్డులో పనికి...
కుమారుడు చేసిన పనికి షాక్ తిన్న ఆ తల్లిదండ్రులకు ఏం చేయాలో తోచలేదు. అతన్ని అలాగే వదిలేస్తే పబ్జీకి మరింత ఎడిక్ట్ అయి జీవితం నాశనం చేసుకుంటారని భావించారు. దీంతో స్థానికంగా ఉన్న ఓ స్కూటర్ మెకానిక్ షెడ్డులో పనికి కుదిర్చారు. ఇప్పటినుంచి ఇక అతనికి ఎట్టి పరిస్థితుల్లోనూ స్మార్ట్ ఫోన్ ఇచ్చేది లేదని తెగేసి చెప్పారు. కష్టపడి సంపాదిస్తే తప్ప అతనికి డబ్బు విలువ తెలియదని... అందుకే పనిలో కుదిర్చామని చెప్పారు. కూడబెట్టుకున్న డబ్బు మొత్తం పోవడంతో జీవితంపై ఆశలు వదిలేసుకున్నట్లయిందన్నారు.